మహిళలకు ఎక్కడికి వెళ్ళినా గౌరవం దక్కడం చాలా కష్టం. ఏ రంగంలోనైనా సరే అణగిదొక్కాలనే చూస్తారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ సినీ దర్శకుడు గీతాకృష్ణపై విశాఖపట్నంలో కేసు ఫైల్ అయింది. సినిమాల్లో నటించే మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ విశాఖపట్నం విమెన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యలు గీతాకృష్ణపై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గీతాకృష్ణ అక్కయ్యపాలెంలో గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్, హైదరాబాద్ మాదాపూర్లో మరో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్నారు. ఇటీవల వివిధ చానల్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలు, సామాజిక మాధ్యమాల్లో ఆయన సినిమాల్లో నటించే మహిళలపై అసభ్యకర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ను కోరారు.
గతంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన గీతాకృష్ణ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ పరిశ్రమలో జరిగే వ్యవహారాలపై షాకింగ్ కామెంట్లు చేశారు. ధనవంతుల పిల్లలే డ్రగ్స్ వాడతారని, సాధారణ ప్రజలకు అదేంటో తెలియదని అన్నారు. ఇండస్ట్రీలో చాలామంది డ్రగ్స్కు అలవాటు పడ్డారని పేర్కొన్నారు. అలాగే, సినిమాల్లో రొమాంటిక్ సీన్లను అమ్మాయిలు ఇష్టంతో చేయరని చెప్పారు. రూ. 50 లక్షలు ఇస్తే హీరోయిన్లు గెస్ట్హౌస్కు వెళతారని పేర్కొంటూ వెగటు వ్యాఖ్యలు చేశారు.