who will win in Andhra Pradesh for 2019 elections
- సమాచారం సేకరించిన కేంద్ర నిఘా వర్గాలు
- జగన్ కే విజయావకాశాలని మోదీకి నివేదన
రికార్డు దూరం పాదయాత్రతో ఏడాదిన్నరగా ప్రజల్లోనే ఉన్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ తీరాలను చేరనున్నారా? వచ్చే ఎన్నికల్లో ఇటు అసెంబ్లీతోపాటు అటు లోక్ సభ ఎన్నికల్లోనూ భారీగా సీట్లు గెలుచుకోబోతున్నారా? కేంద్ర నిఘా వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. మెజార్టీకి 15 సీట్ల దూరంలో ఆగిపోతుందంటూ తాజాగా వచ్చిన సర్వేలు నిర్ధారించడంతో, తదుపరి వ్యూహాలప ప్రధాని మోదీ దృష్టిపెట్టారు. అటు యూపీఏ లేదా ఇటు ఎన్డీఏకి సమానదూరం పాటించే పార్టీల వివరాలు, వాటికి ఉన్న విజయావకాశాల వంటి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఏపీ పరిస్థితి పైనా ఆరా తీయగా.. అధికార టీడీపీపై వ్యతిరేకత ఎక్కువగానే ఉందని వెల్లడైంది. ఇదే సమయంలో పూర్తిగా ప్రజల్లోనే ఉంటున్న జగన్ వైపు ప్రజా నాడి ఉందనే సంగతి తేలడంతో అదే విషయాన్ని మోదీకి నివేదించినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించడం ఖాయమని తమ సర్వేలో తేలిందని చెప్పారని తెలిసింది. అంతేకాకుండా రాష్ట్రంలోని మొత్తం 25 సీట్లలో 15-20 సీట్లు జగన్ పార్టీ ఖాతాలో పడతాయని నిఘా వర్గాలు నిర్ధారించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తనకు అవసరమైన మెజారిటీ రాని పక్షంలో ఈ మేర ఎంపీ సీట్లు వచ్చే వైఎస్సార్ సీపీని తమ వైపు తిప్పుకోవడానికి ఉన్న అంశాలపై మోదీ అప్పుడే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఉప్పందడంతోనే హఠాత్తుగా పింఛన్ల పెంపు ప్రకటించారని అంటున్నారు. గత ఎన్నికల్లో రుణమాఫీ ద్వారా గట్టెక్కిన టీడీపీ.. ఈసారి పింఛన్ల పెంపు ద్వారా మరోసారి ఓట్లు కొల్లగొట్టాలని యోచిస్తోందని అంటున్నారు. వాస్తవానికి తాము అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతామని జగన్ ఎప్పుడో ప్రకటించారని, ఇప్పుడు ఓడిపోతామనే భయంతో ఎన్నికల ముందు చంద్రబాబు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నందున ఈలోగా బాబు మరెన్ని హామీలు గుప్పిస్తారో చూడాలి.