women helpline number
వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకా రెడ్డి దారుణ హత్య ఘటనతో తెలంగాణా పోలీసుల్లో చలనం వచ్చింది . రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు మహిళల రక్షణే తమ కర్తవ్యం అని తెగ ప్రకటనలు చేస్తున్నారు. మహిళలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఏ సమయంలో అయినా సరే పోలీసులు మీకు అండగా ఉంటారు అంటూ భరోసా ఇస్తున్నారు . ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా 100 నెంబర్ కు డయల్ చేయాలని మహిళలకు సూచిస్తున్నారు పోలీసులు .ఇక ప్రియాంకా రెడ్డి హత్య ఘటన తో డీజీపీ మహేందర్ రెడ్డి మహిళలకు పలు సూచనలు చేశారు. రాత్రివేళ ప్రయాణాల్లో మహిళలు, వృద్ధులు తమ వాహనాలు చెడిపోయినప్పుడు, ఇబ్బందికర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రివేళల్లో ముప్పు పొంచి వుందనుకున్నప్పుడు డయల్-100, 9490617111 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్లు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కూడా మహిళల రక్షణ బాధ్యత అంటూ పలు సూచనలు చేశారు. ప్రమాదంలో ఉన్న మహిళలు 100కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు. షీ టీమ్స్ ల్యాండ్ లైన్ నంబరు 040-2785 2355, వాట్సాప్ నంబరు 9490616555కు సమాచారం ఇచ్చినా వారు వెంటనే సాయం అందిస్తారని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయని 112, 1090, 1091 నంబర్లకు కూడా అత్యవసర సమయంలో ఫోన్ చేసి సాయం కోరవచ్చు అని పోలీసులు పేర్కొన్నారు.ఇక సీపీ అంజనీ కుమార్ నగరంలో 122 పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నాయని , ఒక్క ఫోన్ కాల్ చేస్తే నిముషాల్లో మీ ముందు ఉంటామని చెప్తున్నారు.