
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. శనివారం మిస్ కెనడా ఎమ్మా మోసరిన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు చెందిన జెన్సికా ఫెడ్రోసో, జోయిలెజ్జాన్సెన్ వాన్ రెన్స్బర్డ్లు నగరానికి వచ్చారు. వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. సోమవారం మిస్ పోర్చుగల్ మారియా అమెలియా ఆంటోనియో నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన మిస్ పోర్చుగల్కి అధికారులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతించి, సత్కరించారు. ఈ రోజే మిస్ ఘనా జుట్టా అమా పోకుహా అడ్డో, మిస్ ఐర్లాండ్ జాస్మిన్ జెర్హార్డ్లు సైతం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నెల 10న ప్రారంభ కార్యక్రమం ఉండనుంది. సోమ, మంగళ, బుధవారాల్లో మిగిలిన దేశాలకు చెందిన సుందరీమణులు హైదరాబాద్కు రానున్నారు. మిస్వరల్డ్ ఛైర్పర్సన్ జూలియా మోర్లీ మూడు రోజుల క్రితమే రాగా పోటీల నిర్వాహకులు జోనాదన్ మార్క్షా ఆదివారం చేరుకున్నారు.
ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడనున్న 120 మంది అందగత్తెలు హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించనున్నారు. పోటీలను కవరేజే చేయడం కోసం వస్తున్న వందకుపైగా దేశాలకు చెందిన జర్నలిస్ట్లు, ఫొటోగ్రాఫర్లు, ఇతర ప్రతినిధులు దాదాపు మూడు వారాలపాటు రాష్ట్రంలోనే ఉండనున్నారు. ఈ క్రమంలో విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ రాష్ట్ర పర్యాటకశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర పర్యాటక విధానం రూపొందించాక జరుగుతున్న అత్యంత కీలకమైన కార్యక్రమంగా దీన్ని ఆ శాఖ భావిస్తోంది. 2024లో తెలంగాణకు 1,55,113 మంది విదేశీ పర్యాటకులు రాగా ఈ సంవత్సరం వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పర్యాటకశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
సుందరీమణులు పాల్గొనే వేదికలతోపాటు వారు భాగస్వాములయ్యే, సందర్శించే ప్రదేశాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రారంభ కార్యక్రమానికి వేదికైన గచ్చిబౌలి స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తయారుచేస్తున్నారు. స్టేడియం లోపల కళ్లు మిరుమిట్లు గొలిపేలా లైటింగ్ ఏర్పాట్లు, ప్రత్యేక అలంకరణలు చేస్తున్నారు.