కాశ్మీర్ ఉగ్రవాదుల కాల్పులతో చిందిన రక్తంతో పహల్గావ్ ప్రాంతం తడిసి ముద్దైంది. కశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులపై టెర్రరిస్టులు క్రూరమైన దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఉగ్రవాదుల ఉన్మాద చర్యలను ప్రపంచవ్యాప్తంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నది. ఈ విషాద సంఘటనపై సినీలోకం కూడా స్పందిస్తూ తమ విచారాన్ని తెలుపుతున్నారు. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ ఘటనపై సినీ ప్రముఖులు స్పందనలు.. పహల్గావ్లో ఉగ్రవాదుల దాడి అత్యంత విషాదకరం. మానవ చరిత్రలో చీకటి రోజు. ఈ క్రూరమైన దాడిని ముక్తకంఠంతో ఖండించాలి. బాధితులకు మనోధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషాద సమయంలో గుండె పగిలిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ” కశ్మీర్లోని పహల్గావ్లో ఉగ్రవాదుల దాడి ఘటన అత్యంత దురదృష్టకరం. అమాయకులైన పర్యాటకులపై పిరికిపందలుగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. పౌరసమాజంలో ఉగ్రవాదానికి చోటు ఉండకూడదు. ఇలాంటి హేయమైన చర్యకు తావులేదు. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఈ సంఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని నటుడు సోనుసూద్ ట్వీట్ చేశారు. కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడిని నేచురల్ స్టార్ నానీ ఖండించారు. మూడు నెలల క్రితం మేము అక్కడ ఉన్నాం. దాదాపు 200 మంది 20 రోజులపాటు అక్కడే షూట్ చేశాం. అక్కడి ప్రజలు, ప్రాంతం చాలా గొప్పది. ఉగ్రవాదుల దాడి ఘటన విన్న తర్వాత గుండె ముక్కలైంది. నోటి నుంచి మాటలు రావడం లేదు. ఎందుకు ఈ మారణహోమం అని నాని ఆవేదన వ్యక్తం చేశారు.