- భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి
- ఎన్నికల కమిషన్ అనుమతి
- రెండు సార్లు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం
కోట్లాది భక్తులకు ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. ప్రతి ఏడాది కన్నుల పండువగా వైభవంగా జరిగే ఈ వేడుకలను కోట్లాది మంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేవారు. ఈసారి ఎన్నికల కోడ్ కారణంగా ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి వస్తుందో లేదోనన్న అనుమానాన్ని భక్తులు వ్యక్తం చేయగా, ఎలాగైనా ఈ ప్రత్యక్ష ప్రసారాల విషయంలో భక్తులకు అసౌకర్యం కలిగించవద్దని ఇప్పటికే రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. భద్రాద్రి క్షేత్ర ప్రాముఖ్యత, కల్యాణ వేడుక దృష్ట్యా శ్రీ రామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయంలో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. ఈ అభ్యర్థనను ఏప్రిల్ 4వ తేదీనే ఎన్నికల కమిషన్ తిరస్కరించింది.
ALSO READ: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్… 29మంది మావోల మృతి
అయినా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రయత్నం చేసింది. తమ ప్రభుత్వ అభ్యర్థనను పున: పరిశీలించాలని ఏప్రిల్ 6వ తేదీన ఈసీకి మరో లేఖ రాసింది. నేరుగా వైకుంఠం నుంచి వచ్చి కొలువు దీరిన చతుర్భుజ రామునిగా దక్షిణ భారత దేశంలో అపూర్వమైనదిగా కొలిచే భద్రాద్రి రాముని వేడుకలు అత్యంత ప్రాధాన్యమైనవని ఈసీకి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని కోరింది.
1987 నుంచి ప్రత్యక్ష ప్రసారం ఆనవాయితీగా వస్తోందని, 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ లైవ్ ఇచ్చిందని, రేడియో ద్వారా కళ్యాణ మహోత్సవ వ్యాఖ్యానం ప్రసారమైందని ప్రభుత్వం ఈ లేఖలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో కోట్లాది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని ఈసీని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఈసీ ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.