Wednesday, October 16, 2024

మీరు గ్రేట్ సార్

  • ‘నా భార్య లంచం డబ్బు కట్టలు చూడండి’
  • వీడియో బయటపెట్టిన భర్త

హైదరాబాద్ మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్య జ్యోతిపై ఆమె భర్త తీవ్ర అవినీతి ఆరోపణలు చేశాడు. ప్రతిరోజూ ఇంటికి లంచం డబ్బులు తీసుకొస్తుందని ఆరోపించాడు. తన భార్య లంచాలకు ఇవే సాక్ష్యాలంటూ ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను చూపిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా వరకు ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ చిన్న పని కావాలాన్న లంచం ఇవ్వాల్సిందే. టేబుల్ కింద చేయి పెట్టనిదే కొందరు అధికారులు ఏ ఫైల్ కదలనివ్వరు. ఔనన్నా.. కాదన్నా.. ఇది జగమెరిగిన సత్యం. ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరూ లంచం డిమాండ్ చేయకపోవచ్చు.. కానీ కొందరు అవినీతి అధికారులు మాత్రం లంచం తీసుకోకుండా ఏ చిన్న పని పూర్తి చేయరు. ఇటీవల కాలంలో లంచం తీసుకుంటూ చాలా మంది ప్రభుత్వ అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇప్పటి వరకు లంచగొండి అధికారులను బాధితులు ఏసీబీకి పట్టించారు. అయితే తాజాగా.. ఓ భర్త తన భార్య లంచం తీసుకుంటుందని తీవ్ర ఆరోపణలు చేశాడు. అందుకు సంబంధించిన షాకింగ్ వీడియో బయటపెట్టారు. తన భార్య తెచ్చే లంచం డబ్బులు ఎక్కడెక్కడో పెడుతుందో చూడండి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్య జ్యోతిపై ఆమె భర్త అవినీతి ఆరోపణలు చేయటం కలకలం రేపుతోంది. తన భార్య లంచం తీసుకోనిదే ఇంటికి రాదంటూ ఆమె భర్త శ్రీపాథ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ప్రతి రోజూ ఇంటికి లక్షలకు లక్షలు డబ్బు తెస్తుందన్నారు. మణికొండలో కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున లంచం డబ్బులు తీసుకుంటుందని సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు దివ్యజ్యోతి లంచాలకు ఇవే సాక్ష్యాలంటూ ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను చూపించాడు. ఆ వీడియోలో ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు కట్టలే కనిపిస్తున్నాయి. అల్మారాలు, దేవుడి గది, కబోడ్‌లు, పిల్లోస్ ఇలా ఎక్కడా చూసినా కట్టలకు కట్టలు డబ్బులు కనిపించాయి. లంచం తీసుకోవటం నేరమని తాను ఎన్నిసార్లు హెచ్చరించినా.. తన భార్య ప్రవర్తన మార్చుకోవటం లేదని.. అందుకే వీడియోలు బయటపెట్టినట్లు శ్రీపాథ్ వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే దాదాపు 20-30 లక్షల క్యాష్ ఉంటుందని అన్నారు. ఇటీవలే పుప్పాలగూడలో దాదాపు రెండు కోట్ల విలువైన అపార్ట్ మెంట్ కొనుగోలు చేసిందని ఆరోపించారు.

30 లక్షలు పెట్టి ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ చేయిస్తుందని చెప్పారు. లంచం డబ్బులను తన ఇద్దరు తమ్ముళ్లకు పంపిస్తుందని.. వారి అకౌంట్లలో దాదాపు 70-80 లక్షలు ఉంటాయన్నారు. దివ్యజోత్యి గత కొంత కాలంగా తనను దూరం పెట్టిందని.. కుమారుడిని కూడా చూడనివ్వటం లేదని వాపోయాడు. ఆమె లంచం విషయంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. కాగా, భార్య లంచం డబ్బుల వీడియోను బయటపెట్టిన శ్రీపాథ్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. మీరు గ్రేట్ సార్ అని పొడుగుతున్నారు. అందరు భర్తలు, భార్యలు, కుటుంబ సభ్యులు మీలాగే ఉంటే ఏ ఉద్యోగి లంచం తీసుకోడని తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular