రాష్ట్రంలో ఎఐ నిపుణులను తయారు చేస్తాం..
త్వరలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేస్తాం..
ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో ఎంవోయూ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడి
మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా తెలంగాణ యువతకు భారీ ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యంత్రి రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కృత్రిమ మేధ మైక్రోసాఫ్ట్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అడ్వాంటేజ్ తెలంగాణ పేరుతో ఎఐ ఫౌండేషన్ అకాడమీని ప్రారంభించాయని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ కొత్త కార్యాలయ భవనాన్ని సీఎం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించడంతో యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్ర రాజధానిలో మైక్రోసాఫ్ట్ సంస్థ తన రెండో కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం ఐటీ రంగ అభివృద్ధిలో ఒక మైలురాయి అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఐటీ దిగ్గజం హైదరాబాద్ నుంచి నూతన ఆవిష్కరణల ద్వారా ప్రపంచ వ్యాప్త సేవలు అందించడం గర్వకారణమన్నారు.
ఏఐ నిపుణులను తయారు చేస్తాం
మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యను ప్రవేశపెట్టి, 50,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. ఏఐ ఇండస్ట్రీ ప్రో ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల పారిశ్రామిక నిపుణులను తయారు చేస్తామన్నారు. ఏఐ-గవర్న్ కార్యక్రమం ద్వారా 50 వేల ప్రభుత్వ అధికారులను డిజిటల్ ఉత్పాదకత, జనరేటివ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో శిక్షణ ఇస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను మైక్రోసాఫ్ట్ స్థాపించనుందని సీఎం తెలిపారు.
ఈ కేంద్రం క్లౌడ్ ఆధారిత ఎఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి, ఎఐ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. తద్వారా పరిశోధనలు, కేస్ స్టడీస్, ఉత్తమ ప్రాక్టీసులను సేకరించి రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ ఐడిసిలో కొత్త భవనం తమ సంస్థ తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్కు, భారత ఎఐ ఫస్ట్ నేషన్ విజన్కు మద్దతు తెలుపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్నారు.