Friday, May 30, 2025

కవిత డెవిల్స్‌ వర్సెస్‌ కేటీఆర్‌ కోవర్ట్స్‌ బీఆర్‌ఎస్‌లో డిజిటల్ వార్‌

బీఆర్ఎస్‌లో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ప్రకంపనాలు సృష్టిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇది అతి పెద్ద చర్చకు దారి తీసింది. కవిత ఇక కొత్త పార్టీ పెట్టనుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గులాబీ నేతలు, కార్యకర్తలు ఎక్కడ కలిసినా దీని మీద ఏం అప్డేట్ ఉందన్న చర్చనే సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నేతలు పుండు మీద కారం చల్లినట్లు అటు కేసీఆర్, కేటీఆర్, కవితపై ఈ లేఖను అడ్డం పెట్టుకొని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం కేటీఆర్ టీం వర్సెస్ కవిత టీం డిజిటల్ వార్ ను స్టార్ట్ చేశాయి.

ఆ దెయ్యాలు ఎవరు అంటు సోషల్‌ మీడియాలో టీమ్ కవిత ప్రశ్నలు
కవిత పార్టీ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ బయటపడినప్పటి నుంచి బీఆర్ఎస్ లో రెండు సోషల్ మీడియా టీంలు ఏర్పడ్డాయి. టీమ్ కేటీఆర్ అని ఓ వర్గం, టీమ్ కవిత అని మరో వర్గం హ్యాష్ ట్యాగ్స్‌తో ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి వేదికల ద్వారా డిజిటల్ వార్‌కు దిగారు. ఒకరిపై ఒకరు ప్రశ్నలు సంధిస్తూ కౌంటర్ పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కవిత టీం కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీ ఏమైనా మీ జాగీరా, కవితక్కకు పార్టీ మీద హక్కుల లేవా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో సమన్యాయం అన్నది లేదా అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌కు, తండ్రికి కుమార్తెగా లేఖ రాస్తే దాన్ని బయటపెట్టిన వ్యక్తులు పేర్లు ఎందుకు ప్రకటించడం లేదన్న డిమాండ్స్ చేస్తున్నారు. ఆ దెయ్యాలు ఎవరో బయటపెట్టాలని, వీ స్టాండ్ విత్ కవితక్క అని టీం కవిత వర్గం వారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఆ కోవర్టులు ఎవరు అంటూ టీం కేటీఆర్ కౌంటర్ ప్రశ్న
కవితను నేరుగా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా పార్టీలో అందరు ఒకటే అని వ్యాఖ్యానించడం కవిత ఓ సాధారణ నేతగానే చూస్తున్నట్లు చెప్పకనే చెప్పారని టీం కేటీఆర్ వర్గం పోస్టులు పెడుతోంది. రేవంత్ రెడ్డి కోవర్టులు పార్టీలో ఉండవచ్చు అన్న ఆయన వ్యాఖ్యలను తీసుకొని టీం కేటీఆర్ వర్గం కవిత వర్గంలోని వారే ఆ కోవర్టులని భాష్యం చెబుతూ కౌంటర్ పోస్టులు పెడుతున్నారు.

దెయ్యాలు ఎవరో? కోవర్టులు ఎవరో? కేసీఆరే చెప్పాలి
ఇలా పార్టీలో కవితకు, కేటీఆర్‌కు మద్ధతు ఇచ్చే వర్గాలు పార్టీలో దెయ్యాలు ఎవరో, కోవర్టులు ఎవరో తేలాలని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే దీని మీద పార్టీ నేతలు ఎవరూ బహిరంగంగా చర్చించవద్దని ఇప్పటికే పార్టీ అధినేత సూచించినట్లు కేటీఆర్ పార్టీ వర్గాలకు సమాచారం ఇవ్వడంతో ఎవరూ నోరు మెదడపం లేదు. కాని టీం కవిత, టీం కేటీఆర్ సోషల్ మీడియా బ్యాచ్ లు మాత్రం డిజిటల్ వేదికలపై రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు పార్టీ చీఫ్ కేసీఆర్ మాత్రం ఈ వివాదంపై మౌనంగా ఉన్నారు. పార్టీలో తన కూతురు చెప్పిన దెయ్యాలు ఎవరో, కుమారుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన కోవర్టులు ఎవరో తెల్చాల్సిందే కేసీఆరే. ఇద్దరినీ కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడటం లేదు అన్న చర్చ కూడా సోషల్ మీడియాలోను, అటు పార్టీలోను సాగుతోంది. మరి కొందరైతే ఇక కవిత పార్టీలో ఇమడ లేదని, జూన్ రెండో తేదీన పార్టీ పెట్టనున్నట్లు సోషల్ మీడియా వేదికగానే చర్చలు చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వార్ ఇంతటితో ఆగుతుందా లేక మరిన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. టీం కవిత, టీం కేటీఆర్ వర్గాలకు అటు కవిత, ఇటు కేటీఆర్ ఏం చెబుతారో కూడా ఆసక్తికరమే.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com