ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ఐపీఎస్ అధికారి, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంలో కాస్త ఊరట లభించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్రావు.. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంలో పిటిషన్ వేయగా.. గురువారం విచారణ జరిగింది. ప్రభాకర్ రావుకు తాత్కాలిక ముందస్తు బెయిల్ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. అలాగే ఇండియా వచ్చేందుకు పాస్ పోర్ట్ను కూడా సుప్రీం ధర్మాసనం మంజూరు చేసింది. మూడు రోజుల్లో ఇండియా రావాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావుకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. మూడు రోజుల్లో ఇండియా వచ్చి దర్యాప్తునకు సహకరిస్తా అని వెంటనే అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటికిప్పుడు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ అంశంపై తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
కాగా.. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ గతంలోనే తెలంగాణ కోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇస్తే ఇండియాకు తిరిగి వస్తానని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ప్రభాకర్ రావుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో మే 9న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ప్రభాకర్ రావు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్కు తిరిగి వస్తానని పిటిషన్లో వెల్లడించారు. ఈ పిటిషన్పై ఈరోజు విచారించిన సుప్రీం ధర్మాసనం.. ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పాటు వెంటనే ఇండియాకు తిరిగి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. . తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికాలో ప్రభాకర్ రావు పిటిషన్ వేయగా.. అందుకు అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు జూన్ 20 లోపు కోర్టులో హాజరుకావాలని లేదంటే ప్రకటిత నేరస్థుడిగా ప్రకటిస్తామంటూ నాంపల్లి కోర్టు ఇటీవల స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఇంటి గోడకు పోలీసులు నోటీసులు కూడా అంటించారు. ఇలా ప్రకటిస్తే ప్రభాకర్ రావు ఆస్తులను కూడా జప్తు చేసే అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుంది.