సినీ నటుడు, రచయిత ,దర్శకుడు పోసాని కృష్ణమురళిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ లో ఉన్నారు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు మిగిలిన పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. అయితే, తాము కోర్టు అనుమతి తీసుకున్నామని, ముందుగా పోసానిని తమకే అప్పగించాలని నరసరావుపేట పోలీసులు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పోసానిపై ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో ఆయనను ముందుగా ఎవరికి అప్పగించాలనే దానిపై ఉన్నతాధికారులతో జైలు అధికారులు సమాలోచనలు చేశారు. దీనికి సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. రూల్స్ ప్రకారం ముందుగా ఎవరైతే పీటీ వారెంట్ ను తీసుకువచ్చారో చట్టపరంగా వారికే అప్పగించాలన పోసానిని నరసరావుపేటకు తరలించారు.