Friday, April 18, 2025

ముగిసిన ఎన్నికల ప్రచారం బంద్ అయిన మైకులు…

  • అగ్రనేతలు, ముఖ్యనేతలతో పార్టీల విస్తృత ప్రచారం
  • కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తిన పార్టీలు
  • 17 లోక్‌సభ స్థానాలు…. బరిలో 525 మంది అభ్యర్థులు
  • ప్రలోభాలు, హింసాత్మక ఘటనలపై చివరి 72 గంటలు నిఘా పెట్టిన ఎన్నికల కమిషన్

రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. నెల రోజులుగా సాగుతున్న ప్రచారానికి శనివారంతో బ్రేక్ పడింది. మైకులు బంద్ అయ్యాయి. ఎన్నికలకు 48 గంటల ముందు సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగించాలన్న ఈసీ ఆదేశాల మేరకు, అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముగించాయి. రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. సోమవారం పోలింగ్ జరుగనుండగా వచ్చేనెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాల బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నారు. అందులో 51 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలకు కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్‌లు పోటీ చేస్తున్నాయి. అగ్రనేతలు, ముఖ్యనేతలతో పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహించాయి.

కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలు, బహిరంగ సభల్లో విస్తృతంగా ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రచార గడువు సాయంత్రంతో ముగియడంతో స్థానికేతరులు జిల్లాల నుంచి వెళ్లిపోవాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.

కొన్నిచోట్ల 4 గంటలకే ప్రచారం ముగింపు…

అయితే తీవ్రవాద ప్రాబల్యమున్న 5 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో, సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ సెగ్మెంట్ పరిధిలో ప్రచారానికి బ్రేక్ పడింది. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సాయంత్రం 4 గంటలకే ప్రచారనికి తెరపడింది. ప్రచారం ముగియగానే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతుండటంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తమయ్యింది. ప్రలోభాలు, హింసాత్మక ఘటనలపై చివరి 72 గంటలు నిఘా పెంచింది. అక్రమ మద్యం, డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేయడంతో మద్యం షాపులన్నీ మూతపడ్డాయి.

35,809 పోలింగ్ కేంద్రాలు…1,09,941 ఈవిఎం యూనిట్లు సిద్ధం

ఈవిఎం, వివిప్యాట్ల వాహనాలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా పెట్టింది. పోలింగ్ కోసం తుదిఏర్పాట్లలో జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈవిఎంలు, వివి ప్యాట్లు తీసుకెళ్లే వాహనాలపై పకడ్బందీ నిఘా ఏర్పాట్లు చేసింది. ఆ వాహనాలకు జీపిఎస్ పెట్టడంతో పాటు భద్రతా సిబ్బందిని సమకూర్చింది. ఈవిఎంలను స్ట్రాంగ్‌రూంల నుంచి బయటకు తీసేటప్పుడు పోలింగ్ తర్వాత మళ్లీ తీసుకెళ్లేటప్పుడు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే తప్పనిసరిగా వీడియో చిత్రీకరణ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 35,809 పోలింగ్ కేంద్రాల్లో 1,09,941 ఈవిఎం యూనిట్లను సిద్ధం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com