ప్రముఖ సినీ హీరో మహేష్బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసులకు సంబంధించి మహేష్ బాబుకు ఈడీ నోటీసులిచ్చింది. ఆ రెండు సంస్థలకు మహేష్ ప్రచారకర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఆయన ఇన్ఫ్లూయెన్స్ చేశారనే అభియోగం పై ఈడీ ఈ నోటీసులను జారీ చేసింది. మహేష్బాబుకు సంస్థలు చెల్లించిన పారితోషికంపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. గతంలో సాయిసూర్య డెవలపర్స్ అనే సంస్థకు ప్రచారం చేశారు మహేష్ బాబు. ఆ కంపెనీతో పాటు, దానికి అనుబంధంగా ఉన్న సురానా గ్రూప్ కంపెనీపై తాజాగా ఈడీ దాడులు నిర్వహించింది. అందులో మహేష్ కు ఇచ్చిన మనీ వివరాల్ని గుర్తించింది. వీటిపై ప్రశ్నించేందుకు మహేష్ కు నోటీసులిచ్చింది ఈడీ. తాజా సమాచారం ప్రకారం … ఈ కంపెనీకి ప్రచారం కల్పించడానికి మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారని సమాచారం. ఇందులో కొంత మొత్తాన్ని మహేష్ కు ఆన్ లైన్ ట్రాన్సఫర్ చేశారు. దీనిపై ఎలాంటి వివాదం లేదు. మిగతా మొత్తాన్ని క్యాష్ రూపంలో అందించారనీ, దీనిపై ఈడీకి కొన్ని అనుమానాలున్నట్టు తెలుస్తోంది. సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఎన్నో అవకతవకలకు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. అక్రమంగా లే-అవుట్స్ వేయడం, ఒకే ప్లాట్ ను వివిధ వ్యక్తులకు అమ్మడం, అగ్రిమెంట్లు లేకుండా డబ్బులు తీసుకోవడం, ప్లాట్స్ కు సంబంధించి కట్టుకథలు చెప్పడం లాంటి ఎన్నో ఆరోపణలున్నాయి. ప్రస్తుతానికైతే వంద కోట్ల రూపాయల లావాదేవీలపై ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇందులో మహేష్ కు చేసిన పేమెంట్స్ కూడా ఉన్నాయి.