పీఎం, తెలుగు రాష్ట్రాల సీఎంల తీవ్ర దిగ్భ్రాంతి
హైదరాబాద్: భాగ్యనగరంలో తీవ్రవిషాదం నెలకొంది. పాతబస్తీలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతిచెందారు. భవనంలో ఏసీ కంప్రెషర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది మృతిచెందారు. మలక్పేట యశోద, ఆపోలో డీఆర్డీవో ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, నారా చంద్రబాబు నాయడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావు, పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కేంద్రం పరిహారం..
గుల్జర్హౌస్ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గుల్జర్హౌస్ అగ్నిప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున కేంద్రప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
పాతబస్తీ అగ్నిప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు
గుల్జర్హౌస్ అగ్నిప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
గుల్జర్హౌస్ అగ్నిప్రమాదంపై కలచివేసింది: పవన్ కల్యాణ్
గుల్జర్హౌస్ అగ్నిప్రమాదం కలచివేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రమాదంలో 17 మంది మృతిచెందడం బాధాకరమని చెప్పారు. బాధిత కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
బాధిత కుటుంబాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ
అగ్నిప్రమాద ఘటనస్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అగ్నిప్రమాద ఘటనాస్థలికి మంత్రి పొన్నం, ఫైర్ డీజీ నాగిరెడ్డి చేరుకుని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అగ్నిప్రమాదం సీఎం రేవంత్ ఆరా తీశారని అన్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగలేదని అన్నారు. ప్రమాదం జరిగిన 15నిమిషాలకే ఫైర్ సిబ్బంది చేరుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై ఎవరూ రాజకీయం చేయొద్దని అన్నారు.బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
గుల్జర్హౌస్ అగ్నిప్రమాదం బాధాకరం: మహేష్గౌడ్
గుల్జర్హౌస్ అగ్నిప్రమాదం బాధాకరమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.