కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పడున్న ఐపీఎస్ల సంఖ్య 139 నుంచి 151కి పెరగనుంది. ఇందులో సీనియర్ డ్యూటీ పోస్టులను 83కి పెంచింది. అలాగే స్టేట్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను 20, సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను 33, లీవ్ రిజర్వ్, జూనియర్ పోస్టులను 13, ట్రైనింగ్ రిజర్వ్ పోస్టులను 2కు పెంచింది కేంద్రం. ఇందులో ఐపీఎస్ రిక్రూట్మెంట్ రూల్స్ 1954లోని 9న నిబంధన ప్రకారం ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు 46, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను 105గా కేంద్రం ఖరారు చేసింది. వాస్తవానికి ఐపీఎస్ల క్యాడర్ రూల్స్లోని 4(2) ప్రకారం కేంద్రం ప్రతి ఐదేళ్లకొకసారి క్యాడర్ సంఖ్యపై సమీక్ష చేస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి స్థానిక అవసరాలకు తగ్గట్టు మార్పులు చేస్తుంది. చివరగా తెలంగాణలో చివరగా ఐపీఎస్ క్యాడర్ సమీక్ష 2016లో జరిగింది.
మళ్లీ 2021లో జరగాల్సి ఉండగా కేంద్ర హోంశాఖ ఆ ఏడాది జనవరి 28న ప్రతిపాదనలు పంపాలని తెలంగాణకు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినప్పటికీ వెంటనే చర్యలు తీసుకోలేదు. దీంతో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక 2024 జనవరి 4న, జులై 4న, అక్టోబర్ 7న కేంద్రానికి లేఖలు రాశారు. ఐపీఎస్ క్యాడర్ను సమీక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఎట్టకేలకు తెలంగాణ క్యాడర్ను 151కి పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.