భూకబ్జా కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కన్నారావుకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ను ఇబ్రహీంపట్నం కోర్టు విధించింది. దీంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకు ఆదిభట్ల పోలీసులు తరలించారు. మరోవైపు తనపై అక్రమ కేసులు బనాయించారని త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తానని కన్నారావు తెలిపారు. తాను తొందరలోనే బెయిల్ పై బయటకి వస్తానని కన్నారావు అన్నారు. హైదరాబాద్ మన్నెగూడలోని ఓఎస్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన 2ఎకరాల 10గుంటల స్థలాన్ని 38 మందితో కలిసి కబ్జా చేశారని పేర్కొంటూ ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీసులు కన్నారావును అరెస్టు చేశారు.
కన్నారావు తమ స్థలంలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను జేసిబి సాయంతో తొలగించి కొత్త ఫెన్సింగ్ వేయడంతోపాటు గుడిసె వేసి కొందరిని కాపలా ఉంచారని శ్రీనివాస రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి కన్నారావు వేసిన క్వాష్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. కబ్జాతో పాటు మారణాయుధాలతో అటాక్ చేశారన్న తీవ్రమైన అభియోగాలుండటంతో ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ హైకోర్టు కన్నారావు వేసిన పిటిషన్ను తిరస్కరించింది.