సూర్యపేట జిల్లాలో కుటుంబ కక్షలు ఓ చిన్నారి ప్రాణం తీశాయి. తల్లిదండ్రులపై బంధువులు దాడి చేస్తుంటే ‘మా నాన్నను చంపొద్దు’ అంటూ కాళ్లవేళ్లాపడిన చిన్నారి పావని భయంతో గుండెపగిలి ఇంట్లోనే చనిపోయింది. ఈ ఘటన స్థానికులను కలిచివేయగా.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కళ్లముందే తన తల్లిదండ్రులను గుర్తు తెలియని దుండగులు కొడుతుంటే ఓ చిన్నారి తట్టుకోలేక గుండె పగిలి చనిపోయింది. మా అమ్మనాన్నను కొట్టొద్దు ప్లీజ్ అంటూ కాళ్లవేళ్లాపడి బతిమిలాడినా ఆ దుర్మార్గులు కనికరించలేదు. దీంతో కాపాడండి అంటూ బోరున విలపించిన ఆ చిన్ని గుండే ఆగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఈ దారుణం తెలంగాణలోని సూర్యపేట లో జరగగా వివరాలు ఇలా ఉన్నాయి.
గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి..
సూర్యపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కక్షలతో సోమయ్య దంపతులపై కడారి సైదులు, కాసం కళింగంతోపాటు పలువురు విచక్షణ రహితంగా దాడి చేశారు. కర్రలు, ఇనుపరాడ్లతో తీవ్రంగా గాయపరిచారు. ఈ అటాక్ జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్న సోమయ్య కూతురు పావని (14) కళ్ల ముందే తల్లిదండ్రులపై ప్రత్యర్థుల దాడి తట్టుకోలేకపోయింది. మా అమ్మానాన్నని కాపాడండి అంటూ విలవిల్లాడిపోయింది. పేరెంట్స్ (Parents) ను చంపొద్దూ ప్లీజ్ అంటూ కాళ్లావేళ్లా పడింది. అయినా ఆ దుర్మార్గులు కనికరించకుండా చావగొడుతుంటే తట్టుకోలేకపోయింది. గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి చివరికి అక్కడే భయంతో ప్రాణాలు వదిలింది. బాలిక మృతితో నిందితులు పరారయ్యారు. కూతురు మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తున్న తల్లిదండ్రులను చూసి స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపుతున్న ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేటీఆర్. రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నాయని, శాంతి భద్రతలు లేవంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.