ఆర్టీసిలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
ఆర్టీసి ప్రయాణికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో 200 కొత్త ఆర్టీసి బస్సులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్టీసిలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం మంత్రి పొన్నం జహీరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి పునాదులపై నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే కుప్పకూలిపోతుందని ఆయన విమర్శించారు.
తెలంగాణలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలు, కులాలను గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ బిఆర్ఎస్, బిజెపిల రాజకీయ ఎత్తుగడేనని ఆయన ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.