ఒక కుటుంబాన్ని పూర్తిగా అధ్యయనం చేసేలా జనాభా గణన ప్రశ్నావళి సిద్ధం చేస్తోంది కేంద్రం. ఇందులో దాదాపు 36 ప్రశ్నలు ఉంటాయని చెబుతున్నారు. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభించేందుకు కేంద్రం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రక్రియ ప్రారంభించబోతోంది. ఈ సారి జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేపట్టేందుకు అంగీకరించింది. ముందుగా వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి హిమాలయ పరిసర ప్రాంతాల్లో సర్వే ప్రారంభించనుంది. దీన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేసి అక్కడి నుంచి మిగతా దేశవ్యాప్తంగా సర్వే చేపడతారు.
36 ప్రశ్నలతో సిద్ధం
జనాభా, కులగణన ఒకేసారి చెపడుతున్నందున, 2011తో పోలిస్తే జీవన ప్రమాణాల్లో ఇతర విభాగాల్లో చాలా మార్పులు వచ్చాయి. అందుకే వచ్చిన మార్పులకు అనుగుణంగా ప్రశ్నావళిని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఈ క్వశ్చనీర్పై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకున్న సమాచారం ప్రకారం 36 ప్రశ్నలతో ఈ గణన జరుగుతుందని తెలుస్తోంది. ఒక కుటుంబాన్ని పూర్తిగా అధ్యయనం చేసేలా ఈ ప్రశ్నావళి ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రశ్నావళిని తయారు చేయడమే కాకుండా అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు అధికారులు. వేల సంఖ్యలలో సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇది కూడా దశలువారీగా ట్రైన్ చేస్తారు. ముందుగా అపెక్స్ స్థాయిలో వందల సంఖ్యలో సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తారు. వారు తర్వాత స్థాయిలో ఉన్న వారికి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్లు క్షేత్రస్థాయిలో ఉన్న వారికి ట్రైనింగ్ ఇస్తారు. ఇలా మూడు దశల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం సిద్ధం చేస్తున్న ప్రశ్నావళిపైనే వీరికి శిక్షణ ఉంటుంది. సమాచార సేకరణలో క్వశ్చనీర్తోపాటు సిబ్బంది ట్రైనింగ్ కూడా ముఖ్యమని అధికారులు భావిస్తున్నారు.
ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు
దాదాపు 36 వరకు ప్రశ్నలతో ప్రతి ఇంటి నుంచి సమాచారాన్ని సేకరించనున్నారు. ఇందులో ఇంటిలో ఉన్న వాళ్ల పేర్లు, వారి వివాహ స్థితి, వారికి పిల్లలు ఉంటే వారి వివరాలు, వారి విద్యార్హతలు, వారు జాబ్ చేస్తుంటే వాటి సమాచారం సేకరిస్తారు. వారు చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేటు ఉద్యోగమా, లేకుంటే సొంతంగా ఏమైనా వ్యాపారం చేస్తున్నారా అనేది నమోదు చేసుకోనున్నారు.
ఇంటికి పెద్ద మహిళ ఉందా లేకుంటే పురుషుడు ఉన్నారా అని అడుగుతారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు అడుగుతారు. వాళ్లు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అయితే వాటిని రిజిస్టర్ చేసుకుంటారు.
ప్రతి ఇంట్లో ఎవరికి ఎన్ని మొబైల్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా ఉంటే ఏ కనెక్షన్ తీసుకున్నారో అడుగుతారు. మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లు ఎన్నో వివరాలు అడుగుతారు.
సొంత వాహనాలు కలిగి ఉన్నా వాటి వివరాలు నమోదు చేస్తారు. సైకిల్ నుంచి కార్ వరకు అన్నింటినీ అడిగి తెలుసుకుంటారు.
ఇంటిలో తాగు నీటి కోసం దేనిపై ఆధారపడుతున్నారో ఆరా తీస్తారు.
విద్యుత్ కోసం ఏం చేస్తున్నారనేది కూడా వాకాబు చేస్తారు.
ఇంట్లో ప్రత్యేకంగా టాయిలెట్స్ ఉన్నాయా లేదా ఉన్నది ఇండియన్ టాయిలెట్టా, వెస్ట్రన్ టాయిలెట్టా అనేది కూడా అడుగుతారు. వాష్రూమ్స్, స్నానాల గదుల గురించి ఆరా తీస్తారు. వృథా నీరు ఏం చేస్తున్నారో కనుక్కుంటారు.
ఎలాంటి కిచన్ ఉంది, దేనిపై ఆధారపడి కుక్ చేస్తున్నారు, గ్యాస్ వాడుతున్నారా లేదా, వాడే సిలిండర్ ఏ కంపెనీదో తెలుసుకుంటారు.
రేడియో ఉందా లేదా టీవీ ఏస్థాయిది ఉందో ప్రశ్నిస్తారు.
సొంత ఇళ్లు ఉంటే అందులో ఎలాంటి ఫ్లోర్ కలిగి ఉంది. గోడలు, పైకప్పు ఎలాంటివి అనేది కూడా వివరాలు నమోదు చేస్తారు. ఇళ్లు ఏ స్థాయిలో ఉంది ఎలాంటిదో కూడా గుర్తించి రిజిస్టర్ చేస్తారు.
ఎంత జంటలు ఇంట్లో ఉన్నారు వారికి ప్రత్యేక రూమ్లు ఉన్నాయా లేదా లేకుంటే ఒకే ఉంట్లో ఎంత మంది ఉంటున్నారో కూడా నమోదు చేస్తారు.
జనాభా గణన చాలా ముఖ్యమైంది. అన్నింటినికీ దీన్నే ఆధారంగా చేసుకుంటారు. అందుకే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా శిక్షణ పొందిన వారి సమక్షంలో నమోదు చేస్తారు.