భారత ఎయిర్పోర్టులు, మిలటరీ స్థావరాలే లక్ష్యం: కేంద్రం
గురువారం రాత్రి పాకిస్తాన్ చేసిన దాడులకు సంబంధించి రక్షణ శాఖ, విదేశాంగ శాఖలు సంయుక్తంగా ప్రెస్మీట్ నిర్వహించి.. కీలక విషయాలు వెల్లడించారు. భారత సరిహద్దు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ వందలాది డ్రోన్లతో దాడులకు తెగబడినట్లు తెలిపారు. దాడుల సమయంలో ఎయిర్స్పేస్ను మూసివేయకుండా.. పాక్ కుట్రలకు తెరలేపిందని పేర్కొన్నారు. అయితే ప్రతిదాడుల సమయంలో పౌర విమానాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా భారత సైన్యం సంయమనం పాటించినట్లు స్పష్టం చేశారు.
భారత్లోని కీలక స్థావరాలు, ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని.. పాకిస్తాన్ చేసిన డ్రోన్లు, క్షిపణి దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్లపై డ్రోన్లపై దాడులకు తెగబడినట్లు తెలిపింది. పాకిస్తాన్ దాడుల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖలు కలిసి తాజాగా మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు చెప్పారు. ప్రధానంగా భారత్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఈ దాడులు చేసినట్లు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
భారత గగనతలంలోకి పాకిస్తాన్ యుద్ధ విమానాలు, డ్రోన్లు వచ్చాయని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. 300 నుంచి 400 డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఎల్ఓసీ వెంబడి పాక్ నాన్స్టాప్గా దాడులకు తెగబడుతోందని వివరించారు. ఈ కాల్పులకు ప్రతీకారంగా భారత్ చేసిన దాడుల్లో పాక్ సైన్యానికి తీవ్ర నష్టం జరిగినట్లు చెప్పారు. భారత్లోని 36 చోట్ల దాడులు చేసేందుకు ఈ 400 డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే ఈ డ్రోన్లను ఎక్కడికక్కడ భారత డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూల్చినట్లు వివరించారు.
భారత్లోని కీలక నగరాలు, ఎయిర్పోర్టులు, ఆర్మీ బేస్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఈ దాడులు చేసినట్లు సోఫియా ఖురేషీ చెప్పారు. దాడుల సమయంలో భారత్ ఎయిర్స్పేస్ను మూసివేయగా.. పాకిస్తాన్ మాత్రం మూసివేయలేదని ఆధారాలతో సహా భారత్ ప్రపంచ దేశాల ముందు ఉంచారు. పౌర విమానాలను రక్షణగా వాడుకుని పాకిస్తాన్ దాడులకు దిగినట్లు తెలిపింది. భారత్ వైపు గగనతలాన్ని మూసివేయగా.. కరాచీ, లాహోర్ ప్రాంతాల్లో ఎయిర్స్పేస్ మూయలేదని పేర్కొన్నారు.
ఈ దాడులకు ప్రతిగా భారత్ చేసిన దాడుల విషయంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ సంయమనం పాటించిందని తెలిపారు. పౌర విమానాల్లో ప్రయాణిస్తు్న్న విదేశీ ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి దాడులకు దిగిందని చెప్పారు. అయితే దాడి చేసిన డ్రోన్లు టర్కీకి చెందిన అసిస్గార్డ్ సోంగర్ డ్రోన్లుగా ప్రాథమిక దర్యాప్తులో ఫోరెన్సిక్ టీమ్ గుర్తించినట్లు వెల్లడించారు. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను పరీక్షించడం, భారత ఇంటెలిజెన్స్ డేట్ను సేకరించడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఈ దాడులు జరిగాయని విక్రమ్ మిస్రీ తెలిపారు.