- చెరువుల ఆక్రమణలపై సమగ్ర సర్వే చేపట్టాలిఆక్రమణలకు గురైన చెరువులను పూర్వస్థితికి తీసుకురావాలి
- అధికారుల సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశం
గ్రేటర్ హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులు, కుంటలపై సంబంధిత అధికారులతో శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టిజిఆర్ఏసి) రిమోట్ సెన్సింగ్ సాంకేతిక ద్వారా 2014 ఉంచి 2023 వరకు ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటల సంబంధించిన వివరాలను వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2014 సంవత్సరానికి ముందు 417 చెరువులు, కుంటలు ఉన్నాయి.
అందులో 182 చెరువులు, కుంటలు పూర్తిగా దురాక్రమణలకు గురయ్యాయి. మరో 76 చెరువులు, కుంటలు పాక్షికంగా ఆక్రమణలకు గురైనట్లు టిజిఆర్ఏసి తన నివేదికలో స్పష్టం చేసింది. గ్రేటర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో మొత్తంగా 503 చెరువులు కుంటలు ఉండగా ఇందులో 62 చెరువులు పూర్తిగా అక్రమణలకు గురయ్యాయని అధికారులు తెలిపారు. మరో 102 చెరువులు, కుంటలు పాక్షికంగా ఆక్రమణలకు గురయ్యాయని, వాటికి అదనంగా 2014 నుంచి 2023 వరకు గ్రేటర్ లోని 417 చెరువులకు గాను 11 చెరువులు పూర్తిగా, మరో 7 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయని అధికారులు వివరించారు.
గ్రేటర్, ఔటర్ పరిధిలో 282 చెరువులు, కుంటలు ఆక్రమణ
ఇక గ్రేటర్ నుంచి ఔటర్ పరిధిలోని 503 చెరువుల్లో 27 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురి కాగా, మరో 24 చెరువులు పాక్షికంగా ఆక్రమించినట్లు అధికారుల నివేదికలో తేలింది. ఈ రకంగా గ్రేటర్, ఔటర్ పరిధిలో మొత్తం 920 చెరువులు, కుంటలకు గాను 282 పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయని అధికారులు తెలిపారు. మరో 209 చెరువులు పాక్షిక ఆక్రమణకు గురయినట్లు ఆయా సంవత్సరాల ఉపగ్రహ చిత్రపటాలు, సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్ల రిమోట్ సెన్సింగ్ సాంకేతిక పరిజ్ఞాన, పరిశీలన ద్వారా స్పష్టమయ్యింది.
చెరువులు, కుంటలు అక్రమణాలకు సంబంధించిన టోపోషీట్లను, చిత్ర పటాలను పరిశీలించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఆక్రమణలపై సమగ్ర క్షేత్ర స్థాయి సర్వే ద్వారా వాటిని పూర్వ స్థితిని పునరుద్ధరించడానికి చర్యలు చేపడతామని తెలియజేశారు. ఈ సమీక్షలో టిజిఆర్ఏసి సంస్థ అడిషనల్ డైరెక్టర్ జనరల్ పి. మనోహర్, సైంటిఫిక్ ఆఫీసర్స్ బాలకృష్ణ, పి. ప్రకాష్, అశ్విని కుమార్ దాస్ ఆర్ఎన్ చారిలు పాల్గొన్నారు.