Saturday, September 21, 2024

పెట్టుబడిదారులు నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుచేస్తాం

* పెట్టుబడిదారులు నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుచేస్తాం
* 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం
* విజయవాడలో నిర్వహించిన సీఐఐ సమావేశంలో మంత్రి నారా లోకేష్
* ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన పారిశ్రామికేవేత్తలు
విజయవాడ: పెట్టుబడుదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుచేయనున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడలోని తాజ్ వివాంత హోటల్ లో భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. గత ఐదేళ్లలో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు, రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారో ఈ సదస్సులో చర్చించడం జరిగింది. ఇందుకోసం కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెట్టుబడుదారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ప్రభుత్వంతోనే చర్చించవచ్చు. కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుపై వారం రోజుల్లో జీవో ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వాలు మారవచ్చుకానీ గవర్నెన్స్ అనేది శాశ్వతంగా ఉండాలి. ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు, ఒప్పందాలను వేరే ప్రభుత్వం మార్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
వైకాపా నిర్ణయాల వల్ల దేశానికే చెడ్డపేరు వచ్చింది
గత ప్రభుత్వంలో తీసుకున్న పీపీఏల రద్దు నిర్ణయం వల్ల కేవలం రాష్ట్రమే కాకుండా దేశం కూడా నష్టపోయింది. రాబోయే రోజుల్లో అది జరగకూడదు. రెన్యువబుల్ ఎనర్జీలో గతంలో ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టారు. వైకాపా ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశానికే చెడ్డపేరు వచ్చింది. అది జరగకూడదని కన్సల్టేటివ్ ఫోరమ్ ఏర్పాటుచేస్తాం. మేం లీడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసికట్టుగా చర్చించి అవసరమైతే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది.
20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం
రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం. దానికి కావాల్సిన రాయితీలు ఇవ్వడంతో పాటు, మౌలిక సౌకర్యాలు, ఎకో సిస్టమ్ ఏర్పాటుచేస్తాం. సదస్సులో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు కూడా సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారికి రావాల్సిన రాయితీలు, వారితో పెట్టుబడులు పెట్టించేందుకు ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డులో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేస్తామని వారికి హామీ ఇచ్చాం. గతంలో టీడీపీ హయాంలో ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు ఉండేది. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండేది. గత ప్రభుత్వం ఈడీబీని మూసేసింది. మూసేసిన ఈడీబీని పునరుద్ధరించాం. ఈడీబీలో పనిచేసినవారందరూ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. వారందరూ ఈడీబీలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ ను కూడా ఈడీబీ సీఈవోగా నియమించడం జరిగింది.
నూతన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాం
రాష్ట్రాభివృద్ధిలో సీఐఐ కీలకపాత్ర పోషించాలని సమావేశంలో మంత్రి నారా లోకేష్ కోరారు. విశాఖను ఐటీ హబ్ గా రూపొందించడంతో పాటు డేటా సెంటర్, ఏఐ యూనివర్సిటీని నెలకొల్పుతామన్నారు. ఆయా జిల్లాల్లో ఉన్న వనరుల ఆధారంగా పరిశ్రమలను ఏర్పాటుచేస్తామన్నారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నామని, ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండా అని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గల విస్తృత అవకాశాలను భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులకు వివరించారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular