-
జపాన్ లో భారీ భూకంపం- ఏ క్షణమైనా సునామీ
-
రిక్టర్ స్కేల్ పై 7.1 గా భూకంప తీవ్రత నమోదు
జపాన్ దేశాన్ని మరోసారి భారీ భూకంపం భయాందోళనకు గురిచేస్తోంది. దక్షిణ సముద్ర తీర ప్రాంతంలో క్యుషు ద్వీపం సమీపంలో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 7.1 గా నమోదైంది. 30 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని జపాన్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భూకంపం నేపధ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇక భూకంప కేంద్రం దగ్గర్లోని విమానాశ్రయం అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ మీడియా కధనాలను ప్రసారం చేసింది.
జపాన్ లోని క్యుషు ద్వీపంలోని నిచినాన్, మియాజాకి సమీపంలోని పలు ప్రాంతాలపై భూకంపం ప్రభావం కనిపించిందని అధికారులు తెలిపారు. దక్షిణ సముద్ర తీరంలో 1.6 అడుగుల ఎత్తులో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. భూకంప తీవ్రత, జరిగే నష్టంపై అంచనా వేస్తున్నట్లు జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ చెప్పారు. భూకంప ప్రభావిత ప్రాంత ప్రజలు సముద్ర తీరానికి దూరంగా వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక క్యుషు, షికోకు ప్రాంతంలోని న్యూక్లియర్ రియాక్టర్లు సేఫ్ గానే ఉన్నాయని, భూకంప ప్రభావం వాటిపై ఉండబోదని జపాన్ న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ తెలిపింది.
జపాన్ లో 2011లో సంభవించిన భూకంపం, సునామితో పుకుషిమా అణు కేంద్రం దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జపాన్ లో భూకంపాలు సంభవించిన ప్రతి సందర్బంలోను న్యూక్లియర్ రియాక్టర్ల భద్రతపై ఆందోళన నెలకొంటూ వస్తోంది. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంటుంది. 40 వేల కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లో మొత్తం 450 అగ్ని పర్వతాలున్నాయి. అందులో మెజారిటీ అగ్నిపర్వతాలు జపాన్ లోనే ఉండగా.. అవి నిరంతరం క్రియాశీలకంగా ఉంటాయి. జపాన్ 4 కాంటినెంటల్ ప్లేట్స్ చర్యలతో సంబంధం కలిగి ఉండటంతో పాటు.. ద యురేసియన్, ద పసిఫిక్, ద ఫిలిప్పీన్, ద నార్త్ అమెరికా ఫలకాలు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. దీంతో వచ్చే కదలికలతో జపాన్ లో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
జపాన్ ట్రెంచ్గా పిలుస్తున్న జపనీస్ అగాధం కూడా ఇక్కడ తరుచూ భూకంపాలు రావడానికి మరో కారణంగా చెబుతారు. పసిఫిక్ వాయువ్య ప్రాంతంలోని ఈ సముద్ర అగాధం 800 మీటర్ల లోతులో ఉంటుంది. అందులో కదలికలు ఏర్పడినప్పుడు జపాన్ లో భూకంపాలు, సునామీలు వస్తుంటాయి. ఇక జపాన్ లో ప్రతి సంవత్సరం సగటున ఐదు వేల చిన్నాపెద్దా భూకంపాలు సంభవిస్తుంటాయి. అక్కడి ప్రభుత్వం, స్థానిక ప్రజలు ఈ భూకంపాలను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్దులై ఉంటారు. భూకంపంతో పాటు, సునామీ కూడావస్తే జపాన్ రాజధాని టోక్యో సిటీలోకి భారీగా సముద్రపు నీరు వచ్చి చేరుతుంది.