- వాహన్ పోర్టల్, స్క్రాపింగ్ పాలసీ, పన్నుల విధానం,
- ఆదాయం వివరాలు, చెక్ పోస్టుల పనితీరుపై అధ్యయనం
తమిళనాడులో రవాణాశాఖ కార్యాలయం చేపట్టిన సంస్కరణలు, పన్నుల విధానం తదితర అంశాల గురించి అధ్యయనం చేయడానికి తెలంగాణ రవాణా శాఖ అధికారుల బృందం తమిళనాడు వెళ్లింది. తమిళనాడులో అమలవుతున్న రవాణాశాఖ విధానాలను అధ్యయనం చేయడానికి తెలంగాణకు చెందిన అధికారుల బృందం ఈ రెండు రోజుల పర్యటన చేపట్టింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ (ఐఏఎస్)ల ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా శాఖ అధికారుల బృందం రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, ఉప్పల్ ఆర్టీఓ వాణి, కామారెడ్డి ఎంవిఐ జింగ్లి శ్రీనివాస్లు ఈ సందర్భంగా సోమవారం తమిళనాడు రవాణా శాఖ కమిషనర్ షణ్ముగ సుందరం (ఐఏఎస్)తో భేటీ అయ్యారు.
ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్, వాహన్ పోర్టల్, స్క్రాపింగ్ పాలసీ, పన్నుల విధానం, ఆదాయం వివరాలు, చెక్ పోస్టుల పనితీరు, ఆన్లైన్ సర్వీసులు తదితర అంశాలు తమిళనాడులో అమలవుతున్న తీరుతెన్నుల గురించి వారు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో నాలుగు బృందాలు పర్యటించి ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయగా సోమవారం రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం జూలై 1, 2 తేదీల్లో పర్యటించనుంది. వీరి అధ్యయనానికి తోడ్పాటుగా తమిళనాడు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేష్ , ఆర్టిఓ సంపత్కుమార్, ఎంవిఐ కార్తీక్లను తమిళనాడు రవాణా శాఖ నియమించింది. త్వరలో కమిషనర్కు నివేదిక సమర్పిస్తామని చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.