నిషేధిత ఖలిస్థాన్ నుంచి రూ. 16 మిలియన్ యూఎస్ డాలర్లు
టీఎస్, న్యూస్: సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహాడ్ జైల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మళ్లీ ఆయనను విచారించాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్స్ చేయడంతో.. ఆమ్ ఆద్మీ పార్టీ స్పందన ఎలా ఉండనుందనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సెనా కీలక నిర్ణయం తీసుకున్నారు. నిషేధిత ఖలిస్థాన్ సంస్థల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రూ.16 మిలియన్ యూఎస్ డాలర్లు అందుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను విచారించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సెనా సోమవారం సిఫార్స్ చేశారు.
అసలు ఏం జరిగింది…
నిషేధిత ఖలిస్థాన్ గ్రూప్లకు, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య క్విడ్ ప్రోకో జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ఆప్కి నిధులు అందిస్తే.. తీహాడ్ జైల్లో ఉన్న టెర్రరిస్ట్ దేవీందర్ పాల్ సింగ్ భుల్లర్ను విడుదల చేయిస్తామని సదరు గ్రూప్లకు చెందిన నేతలతో న్యూయార్క్లో అరవింద్ కేజ్రీవాల్ ఒప్పందం చేసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. అందులోభాగంగా 2014 నుంచి 2022 మధ్య నిషేధిత ఖలిస్థాన్ గ్రూప్ల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 16 మిలియన్ల యూఎస్ డాలర్లు అందినట్లు ఓ ఆరోపణ.
అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో.. ఖలిస్థాన్ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక 1993 ఢిల్లీ బాంబు పేలుడు కేసులో భుల్లార్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఈ పేలుడు ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో అతడు నిందితుడని టాడా కోర్టు స్పష్టం చేసింది. దీంతో భుల్లార్కు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది. అనంతరం దీనిని సుప్రీంకోర్టు యావజ్జీవ ఖైదుగా మార్చింది.