ఏసీపీ ఉమామహేశ్వర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
సాహితీ ఇన్ఫ్రా కేసు విచారణ అధికారిగా ఏసీపీ
ప్రీలాంచ్ ఆఫర్లతో వెయ్యికోట్లు వసూలు చేసి, మధ్య తరగతి వర్గాలను నిండా ముంచిన సాహితీ ఇన్ ఫ్రా కేసును విచారిస్తున్న సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు ఒక్కసారిగా కలకలం సృష్టిస్తున్నాయి. ఏసీపీ ఉమామహేశ్వర్ ఇంట్లో పాటుగా నగరంలోని పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర రావు ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్లో మొత్తం అరు చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. సాహితీ ఇన్ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వర రావు ఉన్నారు. అశోక్ నగర్లో ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి, ఏసీపీ స్నేహితులు, బంధువుల ఇళ్లల్లోనూ ఏబీసీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.
సాహితీ ఇన్ ఫ్రా కేసులో ఉమా మహేశ్వర్రావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలున్నాయి. సాహితీ సంస్థకు లబ్ధి చేసే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు.. ఉమామహేశ్వర్రావు సర్వీసు రికార్డులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లో 6 ప్రాంతాలు, ఇతర చోట్ల నాలుగు ప్రాంతాల్లో దాడులు చేశారు. సాహితీ ఇన్ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉండగా.. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పని చేశారు. అప్పటి నుంచి ఆయనపై పలు ఆరోపణలున్నాయి. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఆయన పేరు బయటకు వచ్చినట్లు సమాచారం. కానీ, ఆయన ఈ కేసు నుంచి ఎలాగో తప్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి.