ఢిల్లీలో బీజేపీ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 27 ఏళ్ల నిరీక్షణ తరువాత ఢిల్లీ పీఠం దక్కించుకుంటోంది. స్పష్టమైన మెజార్టీ దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. 13 ఏళ్ల ఆప్ ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికారు. పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే బీజేపీ వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా, దాదాపు 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కన్పిస్తుండగా, మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో కమలదళం ఆధిక్యంలో కొనసాగుతోంది. దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటేసి అత్యధిక మెజార్టీలో కనబరుస్తోంది. బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే.. 13 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇక ఆప్ 22 స్థానాల్లో ముందంజలో ఉంటే 5 స్థానాల్లో విజయం ఖరారైంది. కాంగ్రెస్ మాత్రం పోటీ నుంచి తప్పుకున్నట్టే.
ప్రస్తుతం కమలం పార్టీ 48 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. నాలుగోసారి అధికారం చేపట్టాలనుకున్న ఆప్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ తొలుత ఒక చోట ముందంజలో ఉన్నట్లే కన్పించినా ఆ తర్వాత వెనుకంజలోకి పడిపోయింది. ఏ స్థానంలోనూ హస్తం పార్టీ ప్రభావం చూపలేకపోయింది.