దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో అరెస్టై 17 నెలల తరువాత తీహార్ జైలు నుంచి విడుదలైన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో రిలాక్స్ అవుతున్నారు. చాలా రోజుల తరువాత ఇంటికి రావడంతో విశ్రాంతి జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు మనీష్. శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా శనివారం ఉదయం ఇంట్లో తన భార్యతో కలిసి చాయ్ తాగుతూ తీసుకున్న సెల్ఫీ ఫోటోను ట్విట్టర్-ఎక్స్ లో పోస్టు చేశారు.
గత సంవత్సరం 2023 ఫిబ్రవరి 26న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో 17 నెలల పాటు జైలు జీవితం గడిపిన సిశోడియా శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. 17 నెలల తరువాత, ఫస్ట్ మార్నింగ్ టీ ఆఫ్ ఫ్రీడమ్ అంటూ ట్విట్టర్- ఎక్స్ వేదికగా తన భార్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు మనీష్ సిశోడియా. భారతీయులందరికీ రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు నుంచి వచ్చిందే ఈ స్వేచ్ఛ అంటూ ఈ సందర్బంగా సిసోడియా భావోద్వేగపూరితమైన కామెంట్స్ చేశారు.