- వైస్చాన్సలర్స్ జాతీయ సదస్సులో రోడ్మ్యాప్
- ఐసిఏఆర్ డైరెక్టర్ జనరల్ హిమాన్షు పాతక్
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ లక్షసాధనకు వ్యవసాయరంగమే మూలాధరం అని భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాతక్ అన్నారు. ఇప్పటికీ భారతీయ వ్యవసాయంపైనే 50శాతం జనాభా అధారపడి జీవనం సాగిస్తున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో సైతం దేశ ప్రగతి ,దేశ శాంతి అన్ని కూడా వ్యవసాయరంంపైనే ఆధారపడి ఉంటాయని డి.జి పాతక్ అన్నారు.హైదరాబాదులోని కన్హ శాంతి వనంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, హార్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం, డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6,7 తేదీలలో రెండు రోజులపాటు ఏర్పాటుచేసిన భారతీయ వ్యవసాయ వైస్ ఛాన్స్లర్ ల జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హిమాన్షు పాతక్ మాట్లాడుతూ… వైస్చాన్సలర్ల జాతీయ సదస్సు దేశవ్యవసాయరంగం అభివృద్దికి రోడ్మ్యాప్ రూపొందిలన్నారు.
ఇతర దేశాల ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశ వ్యవసాయం పూర్తిగా విభిన్నమైనదని, భారత దేశంలో వ్యవసాయం అంటే సంప్రదాయం, చరిత్ర, సంస్కృతితో ముడిపడి ఉన్న జీవన విధానమని, అందుకే భారతదేశానికి వ్యవసాయమే వెన్నుముక అని చెప్పారు. 1947 స్వతంత్రం వచ్చే నాటికి వ్యవసాయం పైన ఆధారపడిన భారతీయ జనాభా 75 నుంచి 80 శాతం ఉంటే, ఇప్పటికి కూడా 45 నుంచి 50శాతం తో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగంగా వ్యవసాయమే ఉన్నదని ఆయన గుర్తు చేశారు. 2047 నాటికి సాధించబోయే వికసిత్ భారత్ కు, వికసిత్ కృషి, అంటే వ్యవసాయ పురోభివృద్ధి మూలాధారం కాబోతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం చేయడం అంటే ప్రకృతికి అతి దగ్గరగా జీవించడమే అని తెలిపారు. పదివేల సంవత్సరం క్రితం మొదలైన వ్యవసాయానికి, నేటి వ్యవసాయానికి టెక్నాలజీ, సృజనాత్మకత జోడించబడిందని తెలిపారు. అంటే మొదటి మానవుడు జీవనం సాగించినప్పుడు ఫుడ్ గ్యాదరర్స్ గా ఉండేవారిని, ఆ తర్వాత ఫుడ్ హంటర్స్ గా మారారు.
ఇప్పుడు సొంతంగా ఆహరాన్ని పండించే స్థాయికి ఎదగడంలో వ్యవసాయమే కీలక పాత్ర వహించింది అని ఆయన తెలిపారు. భవిష్యత్తులో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందాలంటే పర్యావరణ సహితంగా ఉండడంతోపాటు, ఆధునిక టెక్నాలజీ ఉపయోగించడం, మేలైన మార్కెటింగ్ గిట్టుబాటు ధర, వ్యవసాయంలో మహిళలు వ్యవసాయ పనులలో మహిళలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం , దేశ సంస్కృతి, సంప్రదాయ మూలాలపై వ్యవసాయం ఉండాలని డాక్టర్ హిమాన్షు పాతక్ పేర్కొన్నారు. వ్యవసాయం స్థితిగతులు, తీరుతన్నులు, జీవన గమనంలో వ్యవసాయ ప్రాధాన్యతను మరింత మరింతగా చేర్చేందుకు గాను పాఠశాలలు, కళాశాలలు, సమాజంలోకి భారీగా ఈ ఆవశ్యకతను తీసుకుపోవలసిన అవసరం ఉందని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లకు ఆయన పిలుపునిచ్చారు. అన్ని స్థాయిల్లో వ్యవసాయ విద్యను ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించనున్నట్టు ఆయన తెలిపారు.
వ్యవసాయం శాశ్వతం అని, మానవ మనుగడకు అదే ఆధారమని శ్రీ రామచంద్ర మిషన్ గ్లోబల్ హెడ్ రెవరర్ దాజీ అన్నారు. మొక్కలు మరింతగా మానవాళికి ఉపయోగపడేలా పరిశోధన చేపట్టాలని కోరారు. సముద్రపు మొక్కలు మానవ ఆరోగ్యంలో, పోషణలో పలు విధాలుగా ఉపయోగపడతాయని వాటిపైన ముమ్మర పరిశోధన చేపట్టాలని కోరారు. వ్యవసాయం లేకపోతే మానవజాతి సుస్థిర జీవన మనుగడ ప్రశ్నార్థకమైతుందని దాజి తెలిపారు. వ్యవసాయరంగంలో సర్టిఫికెట్ కోర్సులు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ ప్రోగ్రాం పై మార్గదర్శకాలు, జాతీయ నూతన వ్యవసాయ విద్యా విధానం మార్గదర్శకాలు, డ్యూయల్ డిగ్రీస్, జాయింట్ డిగ్రీస్ పైన మార్గదర్శకాలు అత్యంత త్వరలోనే విడుదల చేస్తామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.సి అగ్రవాల్ పేర్కొన్నారు.
వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినుల శాతం రోజురోజుకు పెరుగుతుందని, ఇప్పటికే 65శాతం పైగా ఉందని, అందుకే డిగ్రీ స్థాయిలో విద్యార్థినులను, మహిళలను ఎలా గౌరవించాలి అనే అంశాల పైన సైతం అందర్నీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందని, వీటిని సంబంధిత డిగ్రీలలో పాఠ్యాంశాలుగా చేర్చాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బి. నీరజా ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె ఓట్ ఆఫ్ థాంక్స్ తెలిపారు. అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఒకేషనల్ కార్యక్రమాల్లో 2020 జాతీయ విద్యా విధానం అమలుపైన, అలాగే వ్యవసాయ విద్యార్థులకు ఉపాధి అవకాశాలపైన అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లతో చర్చ జరిగింది. ఈ జాతీయ సదస్సులో 50మందికి పైగా వ్యవసాయ ,ఉద్యాన , వెటర్నరీ విశ్వవిద్యాలయాల వైస్చాన్సలర్లు , వర్శిటి అధికారులు ,ప్రొఫెసర్లు, భారత వ్యవసాయ పరిశోధన మండలి నిపుణులు , అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.