ఎస్ఎల్బీసీ టన్నెల్లో 14 కిలోమీటర్లలో చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయని, అక్కడ తవ్వకాలు చేపడితే రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. వారికి ప్రమాదం పొంచి ఉన్నందున రోబోల సాయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనిపెట్టేందుకు కొనసాగుతున్న చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. దేశంలోనే సొరంగాల్లో ఈ తరహా క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదని అన్నారు. అందుకే దేశవ్యాప్తంగా సొరంగాల నిర్మాణాలు, సహాయ చర్యల్లో పాల్గొన్న నిపుణుల సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో 13.950 కిలోమీటర్ల వరకూ సహాయక బృందాలు వెళ్లగలుగుతున్నాయని, చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టడం ప్రమాదకరంగా మారిందని చెప్పారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్కుమార్ రెడ్డి, దేశంలోనే సొరంగాల్లో ఈ తరహా క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదని అన్నారు. అందుకే దేశవ్యాప్తంగా సొరంగాల నిర్మాణాలు, సహాయ చర్యల్లో పాల్గొన్న నిపుణుల సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో 13.950 కిలోమీటర్ల వరకూ సహాయక బృందాలు వెళ్లగలుగుతున్నాయని, చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టడం ప్రమాదకరంగా మారిందని చెప్పారు. అందుకే అక్కడ సహాయ చర్యలు చేపట్టేందుకు రేపటి నుంచి రోబోలను వినియోగించనున్నట్లు చెప్పారు.
కార్మిక కుటుంబాలకు అండ
కేరళ నుంచి వచ్చిన జాగిలాలతో అణ్వేషిస్తే సొరంగంలో ఒకే చోట ముగ్గురు ఉన్నట్లుగా కొన్ని ప్రాంతాలు గుర్తించామని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకుని ఆచూకీ తెలియకుండా పోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. డీవాటరింగ్, డీసిల్టింగ్ కొనసాగుతుందని వివరించారు. 11వ తేదీన సమీక్ష అనంతరం మరో ప్రకటన విడుదల చేస్తామన్నారు.
ఈ క్రమంలో రెండు మూడు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ వద్ద ఏర్పాటు చేసిన టీబీఎం నమూనాను మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రమాద సమయంలో 8 మంది ఎక్కడ చిక్కుకుని ఉంటారని వారిని వెలికి తీయడం ఎలా అన్న అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్మికులను బయటకు తీసుకొచ్చే ప్రణాళికను కల్నల్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు.
110 మంది కార్మికులు లోపలికి
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికుల జాడను కనుగొనేందుకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనుల్లో వేగం మరింత పెంచేందుకు సింగరేణి నుంచి కార్మికులను రప్పించారు. నిన్న 110 మంది కార్మికులు లోపలికి వెళ్ళారు. దాంతో పాటూ టన్నెల్ పైన భూమి ఎలా ఉందో తెలుసుకునేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) ప్రతినిధులు అటవీ ప్రాంతంలో సర్వే చేశారు. హైదరాబాద్ కు చెందిన అన్వీ రోబోటిక్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు వరసగా రెండోరోజు కూడా సొరంగంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లారు.