- వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవు
- మహేశ్వర్ రెడ్డి అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలి
- సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి, ఉత్తమ్కుమార్లు తెల్లని కాగితం లాంటి వారు
- కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సిఎం రేవంత్రెడ్డి సారథ్యంలో మంత్రులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గురువారం గాంధీభవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అందులో సందేహాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ లక్ష్యాలతో బిఆర్ఎస్, బిజెపిలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
రోజుకో ట్యాక్స్ పేరుతో సిఎం, మంత్రులపై ఆరోపణలు
బిజెపిఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, సిఎం రేవంత్, మంత్రులపైన అవాస్తవాలతో కూడిన విమర్శలు చేస్తున్నారని జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. రోజుకో ట్యాక్స్ పేరుతో సిఎంపైన, మంత్రులపై మహేశ్వర్ రెడ్డి మీడియాలో దుష్ప్రచారం చేయడం కాకుండా ఆయన వద్ద నిజంగా ఆధారాలు ఉంటే వాటిని మీడియాకు అప్పగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఇకనైనా మహేశ్వర్ రెడ్డి ఇటువంటి అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మహేశ్వర రెడ్డి అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుర్తింపు కోసమే ఉత్తమ్పై విమర్శలు…
సిఎం, భట్టి, ఉత్తమ్కుమార్లు తెల్లని కాగితం లాంటి వారని, అనవసరంగా ఎందుకు వారిపై ఇంకు చల్లుతారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. బట్ట కాల్చి ఉత్తమ్ మీద వేయడం కరెక్ట్ కాదని మహేశ్వర రెడ్డికి ఆయన సూచించారు. ఉత్తమ్ను ఇబ్బంది పెట్టడంలో మహేశ్వర రెడ్డికి ఒనగూరే ప్రయోజనం ఏంటో అర్థం కావడం లేదన్నారు. గుర్తింపు కోసమే ఉత్తమ్పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తమ్ ఆచితూచి పని చేసుకుంటూ పోయే వ్యక్తి అని, ఆయన ఎవరి ట్రాప్ లోనూ పడే వ్యక్తి కాదన్నారు. కావాలనే ఉత్తమ్ను టార్గెట్ చేస్తున్నట్లు ఉందని ధ్వజమెత్తారు.
ఉత్తమ్ నిజంగానే తప్పు చేసి ఉంటే ఈ పాటికి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసేవన్నారు. అసలు ఉత్తమ్ మీద మహేశ్వర రెడ్డికి ఎందుకంత కోపం వచ్చిందో చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. రైతులు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పడి నష్టపోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు బురద జల్లడం సహజమే అని ఆయన తెలిపారు.