గద్వాల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోన్న వేళ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ముమ్మాటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకొచ్చారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశానని, అంతేకానీ తాను ఎప్పుడూ, ఎక్కడా కాంగ్రెస్ కండువాను మెడలో వెసుకోలేదని స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తే నష్టపోయేది చివరికి ప్రజలేనని బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. అయితే, బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన బండ్ల కృష్ణమోహన్రెడ్డి.. యూటర్న్ తీసుకున్నారు. తాను తిరిగి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత చాంబర్లో కలిశారు. తాను మళ్లీ సొంత పార్టీలోనే కొనసాగుతానని ఆయనకు చెప్పారు. దీంతో కృష్ణమోహన్రెడ్డి తీసుకున్న ఘర్ వాపసీ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే 24 గంటలు కాకముందే మరో ట్విస్ట్ ఇచ్చారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు చర్చలు పెట్టిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో.. ఆ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. 2 రోజుల కిందట అసెంబ్లీ కారిడార్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనిపిస్తే.. వాళ్లతో ఉన్న పాత పరిచయంతోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడినట్టు మంత్రి పేర్కొన్నారు. అందరం కాంగ్రెస్లోనే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్లోనే కొనసాగుతారని మంత్రి స్పష్టం చేశారు.
ఇప్పుడు మళ్లీ..!
అయితే గతంలో బీఆర్ఎస్ జడ్ పీ చైర్మన్ గా ఉన్న సరితకు బండ్లకు మధ్య విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందే సరిత కాంగ్రెస్లో చేరింది.దీంతో ఆమెకు గద్వాల టికెట్ కేటాయించారు. ఆమె బండ్లపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల తర్వాత బండ్ల కూడా కాంగ్రెస్లో చేరడంతో ఇద్దరి మధ్య వర్గపోరు ముదిరింది. ఈ విషయంలో కాంగ్రెస్ ఇద్దరిని పిలిపించి మాట్లాడినప్పటికీ వివాదం సద్దు మణగలేదు. ఇక జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ సుప్రీంను ఆశ్రయించడంతో అక్కడ కూడా తను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ చెప్పుకున్నాడు.ఆ తర్వాత ఫొటోను కాంగ్రెస్ ఫ్లెక్సీలపై చూసి హైరానా పడ్డారు. “ఏమిటీ! నా అనుమతి లేకుండా నా ఫొటో పెట్టారు? నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా చేశారు!” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా రెండు రోజుల మందుకూడా బండ్లకు సరిత వర్గానికి మధ్య వాగ్వివాదం సాగింది. ఎమ్మెల్యేగా తనకు ఎవరు సహకరించడం లేదని ఆయన వాపోయారు. అయితే అధికారికంగా కాంగ్రెస్లో చేరినప్పటికీ తన మాట చెల్లుబాటు కాకపోవడం, మరోవైపు సుప్రీంలో కేసు నేపథ్యంలో తను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ చెప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.