- యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ
- ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ
స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఆనంద్ మహీంద్ర నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు.
ఆటోమొబైల్, ఎయిరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఐటీ వంటి ప్రముఖ రంగాల్లో మహీంద్రా గ్రూపు సంస్థలకు ఆయన చైర్మన్గా ఉన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. దీని ఏర్పాటు కోసం ఆగస్టు ఒకటో తేదీన రంగారెడ్డి జిల్లా మీర్ఖాఖాన్ పేట బేగరికంచెలో సిఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.
అలాగే ముఖ్యమంత్రి ఇటీవలి కాలంలోనే ఆనంద్ మహీంద్రాతో సమావేశమై స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, లక్ష్యాలను వివరించి దానికి చైర్ పర్సన్ గా కొనసాగాలని సిఎం రేవంత్ కోరారు. ఈ విషయాన్ని విదేశీ పర్యటనలో న్యూయార్క్ లోని ఎన్నారైలతో భేటీలో భాగంగా కొత్త స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఉండటానికి ఆనంద్ మహేంద్ర సానుకూలంగా స్పందించారని, కొద్ది రోజుల్లో ఆయన స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకోనున్నట్లు సిఎం రేవంత్ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ చైర్ పర్సన్గా ఆయన పేరును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.