24 మంది మావోయిస్టులు మృతి
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
15 రోజులుగా జల్లెడపడుతున్న భద్రత బలగాలు
తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాకు సరిహద్దున ఉన్న కర్రెగుట్టల్లో భద్రత బలగాలకు , మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది మావోయిస్టులు మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. గత 15 రోజులుగా భద్రత బలగాలు కర్రెగుట్టలను జల్లెడపడుతున్నాయి. బుధవారం ఉదయం కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రత బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరువురి మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజి సుందర్ రాజు, సిఆర్పిఎఫ్ ఐజి రాకేష్ అగర్వాల్ ఈ ఎన్కౌంటర్ను ధ్రువీకరించారు. ఈ సంఘటన బీజాపూర్ జిల్లా ఊసూరు పరిధిలోని కర్రెగుట్టల్లో జరిగింది. వీరి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటికప్పుడు మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు ఇప్పటికే బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అలాగే ఆలుబాక శివారులో మరో బేస్క్యాంపును ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది.
గత 15 రోజులుగా సిఆర్పిఎఫ్ ,డిఆర్జి, ఎస్టిఎఫ్, భద్రత బలగాలు కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. 9 రోజుల పాటు కూంబింగ్ నిర్వహించిన భద్రత బలగాలు కర్రెగుట్టల నుంచి బయటకు వొచ్చారు. మరో కొత్త భద్రత బలగాల టీమ్ గత నాలుగు రోజుల క్రితం కర్రెగుట్టల్లోకి ప్రవేశించింది. ప్రవేశించిన నాలుగు రోజులకు 24 మంది మావోయిస్టులను హతమార్చారు. ఇప్పటికే కర్రెగుట్టల్లోకి కొత్తగా ప్రవేశించిన భద్రత బలగాలు ఆ గుట్టలపై జాతీయ జెండాను ఎగురవేశాయి. మావోయిస్టుల కోసం డ్రోన్ల సహాయంతో పసిగట్టే యత్నం చేస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా లక్ష్యంగానే కర్రెగుట్టల్లో ఆపరేషన్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీపై ప్రత్యేక నిఘా పెట్టడంతో అనేక మంది మావోయిస్టులు మృతి చెందతున్నారు. ఏప్రిల్ 27న జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందగా కేవలం 10 రోజుల వ్యవధిలో మరో 22 మంది మావోయిస్టులు మృతి చెందడం పట్ల మావోయిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారు.
20వేల మంది భద్రత బలగాలతో కూంబింగ్
మావోయిస్టుల ఏరివేత కోసం అపరేషన్ కగార్ కొనసాగుతుంది. డిఆర్జి, ఎస్టిఎఫ్, బస్తర్ ఫైటర్స్, రాష్ట్ర పోలీసుల విభాగాలతో కలిపి సుమారు 20 వేల మందికి పైగా భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల కోసం కర్రెగుట్టల్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో భద్రత బలగాల ప్రభావం ఎక్కువ ఉండటంతో మావోయిస్టులు సేఫ్ జోన్గా కర్రెగుట్టలను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దున 150 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉన్నది. ఈ ప్రాంతంలో సేఫ్ జోన్గా భావించే మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. మరో సేఫ్ జోన్ కోసం మరో ప్రాంతానికి మావోయిస్టులు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.