-
ఓటర్లు రిటర్స్
-
ఫుల్ రద్దీగా మారిన విజయవాడ హైవే
-
మెట్రో అదనపు ట్రిప్పులు
ఓట్ల పండక్కి వెళ్లిన వారంతా తిరిగి పట్నం బాటపట్టారు. కార్లు, బస్సులు, లారీలు ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్కు బయల్దేరారు. దీంతో హైదరాబాద్ వైపు వచ్చే రహదారుల్లో సోమవారం రాత్రి నుంచి ఒక్కసారిగా రద్దీ పెరిగింది. టోల్గేట్ వద్ద సాధారణంగా రోజుకు 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తుండగా.. సోమవారం రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటల వరకు వీటి సంఖ్య 42 వేలకు పైగా పెరిగింది. మిగిలిన రహదారుల్లోనూ ఇదే పరిస్థితి. రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిటీ నుంచి సుమారు 6 లక్షల మంది ఆంధ్రాకు చేరుకున్నట్లు అంచనా. ఇది ప్రతీయేట సంక్రాంతి సమయంలో ఉండే రద్దీతోపోల్చితే మరింత ఎక్కువేనంటున్నారు అధికారులు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో.. ఓటు వేయడానికి వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాట పట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఇంకా కొనసాగుతున్నది. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బీజేఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లలో రద్దీ నెలకొంది. దీంతో హైదరాబాద్ మెట్రో రద్దీగా మారింది. రైలు రావడమే ఆలస్యం బోగీలన్ని నిండిపోతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అరగంట ముందుగానే సర్వీసులను ప్రారంభించారు. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్లే మెట్రోలో రద్దీ పెరిగింది. దీంతో ఎక్కువ ట్రిప్పులు నడపాలని అధికారులు నిర్ణయించారు