Wednesday, May 14, 2025

అత్యంత వైభవోపేతంగా ఆషాఢ బోనాల ఉత్సవాలు

అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ యేడాది ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ సంవత్సరం తెలంగాణ బోనాల దశాబ్ది ఉత్సవాలు పేరుతో బోనాల జాతరను నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. బోనాల జాతర నిర్వహణకు గాను అడగగానే రూ. 20 కోట్ల రూపాయలను విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సురేఖ ధన్యవాదాలు తెలిపారు.

జిహెచ్‌ఎంసి పరిధిలో ఆషాఢ బోనాల ఉత్సవాలను నిర్వహించే అమ్మవారి దేవాలయాల కమిటీలకు బోనాల నిర్వహణా ఖర్చుల నిమిత్తం శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పలు ఆలయ కమిటీలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోనాల జాతర పోస్టర్ ను, తేదీల వారీగా ఆయా దేవాలయాల్లో నిర్వహించే బోనాల జాతర వివరాలను తెలిపే బోనాల జాతర క్యాలెండర్ ను, వీడియో సాంగ్ ను, బోనాల చరిత్ర, సంస్కృతి, పరిణామక్రమం, క్రతువులను తెలుపుతూ సాంస్కృత శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ బోనాల పై రాసిన ‘బోనాలు’ పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిగారు ముఖ్యమంత్రి హోదాలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ బోనాల జాతరలో పాల్గొంటారని మంత్రి సురేఖ ప్రకటించారు. మంత్రులు ఆయా దేవాలయాల్లో బోనాలు సమర్పిస్తారని తెలిపారు. ప్రజలు ఆనందోత్సాహాలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకుని భద్రంగా ఇండ్లకు చేరేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సాగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఆయా దేవాలయాల పరిధిలో అమ్మవార్ల మహిమలు, దేవాలయ ప్రాశస్యాన్ని తెలిపేలా ఎల్‌ఈడి తెరల పై ప్రదర్శనలు, ప్రజలకు కనులవిందు కలిగించేలా లేజర్ షో లు వుంటాయని మంత్రి తెలిపారు. గత సంవత్సరం బోనాల నిర్వహణకు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలతో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

భక్తులు లక్షలాదిగా హాజరయ్యే ఆషాఢ బోనాల ఉత్సవాలను విజయవంతంగా చేపట్టేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి అన్నారు. దేవాలయాల ప్రాంతాల్లో నివసించే స్థానిక ప్రజలు ఈ దిశగా సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఆలయ కమిటీలు ప్రజలను కలుపుకుపోవాలని, బాగా కష్టపడి బోనాల ఉత్సవాలను జయప్రదం చేయాలని సూచించారు. దేవాలయాలకు సమీపంలోని ప్రైవేట్ హాస్పటల్స్, ఫైర్ స్టేషన్ లతో నిరంతరం కాంటాక్ట్ లో ఉంటూ సహాయ, సహకారాలు పొంది విధంగా ముందస్తు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సురేఖ సూచించారు. బోనాలకు ఎంతమంది హాజరైనా ఇబ్బందులు కలగకుండా మౌలిక సౌకర్యాల కల్పన విషయంలో ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు.

అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సాగుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు విశ్వవ్యాప్తం చేస్తున్న బోనాల ఉత్సవాలను దిగ్విజవంతంగా చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాలు పుస్తక రచయిత, సాంస్కృతిక శాఖ డైరక్టర్ డా. మామిడి హరికృష్ణ, బోనాల జాతర వీడియో సాంగ్ రూపకల్పనలో పాలుపంచుకున్న బృందాన్ని మంత్రులు, అధికారులు శాలువాలతో సత్కరించారు.

దేశ వ్యాప్తంగా నిలిచేలా ఉత్సవాలు : హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర, దేశ వ్యాప్తంగా నిలిచేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూలై 7వ తేదీ శనివారం బేగంపేట హోటల్ హరితా టూరిజం ప్లాజాలో ఆషాఢ మాసం బోనాల దశాబ్ద ఉత్సవాలు 2024కి సంబంధించిన దేవాలయాల కమిటీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ అందరికీ ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు పడి, మంచి పంటలు పండాలని ప్రజలంతా సంతోషాలతో ఉండలని అమ్మవారిని కోరుకుంటున్నామన్నారు. జూలై 7వ తేదీ నుండి గోల్కొండ బోనాలతో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలను ఘనంగా జరపడానికి ప్రభుత్వం తపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు.

అధికారులను, స్థానిక దేవాలయాల కమిటీలను సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు విజయవంతం అయ్యేలా చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ఉత్సవాల విజయవంతానికి హైదరాబాద్ ప్రజల సహకారం కావాలన్నారు. ఏ విధమైన సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తపున అధికారులను ఆదేశించామన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ఉత్సవాలను విజయవంతం చేయడానికి అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అదనపు నిధులు తీసుకొచ్చారన్నారు. నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com