ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం
అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత
ప్రభుత్వాన్ని నిలదీసేలా బిఆర్ఎస్ సన్నద్దం
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులతో స్పీకర్ ప్రసాదరావు సమీక్షించి పలు సూచనలు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లోకి వొచ్చింది.. తొలిరోజు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జిజష్టుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. 13న గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది. 14న హోలీ కారణంగా అసెంబ్లీకి కూడా సెలవు ప్రకటించారు. 15న గవర్నర్ ప్రసంగానికి సిఎం రేవంత్ సమాధానం ఇస్తారు. ఎస్సీ వర్గీకరణ, బిసి బిల్లులతో పాటు అంశాలు చర్చకు రానున్నాయి.
కెసిఆర్ తొలిరోజు హాజరవుతారని ఇప్పటికే కెటిఆర్ సమాచారం ఇచ్చారు. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రుల సమావేశం జరిగింది. ఆయా శాఖలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈనెల 19 లేదా 20న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి మూడు లక్షల 20 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. మార్చి 29 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించనున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు తెలంగాణ భవన్లో కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహం పై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చ లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించారు. ఆరు గ్యారెంటీలకు బ్జడెట్ కేటాయింపులపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా చర్చలో పాల్గొనాలని కేసీఆర్ సూచించారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సి.ఎస్ అధికారులకు సూచించారు. బడ్జెట్ సెషన్లో సరైన సమాచారం అందించేందుకు సంబంధిత కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని, శాఖల వారీగా నోడల్ అధికారులను కూడా నియమించుకోవాలని సి.ఎస్ అన్నారు. తదుపరి రోజుల్లో వివిధ శాఖల డిమాండ్లపై చర్చ జరగనున్నందున, వివిధ శాఖల వారీగా పూర్తి వివరాలతో అధికారులు సన్నద్ధం కావాలని సి.ఎస్ పేర్కొన్నారు.