విపక్ష నేత కేసీఆర్కు లీగల్ నోటీసులు
అసెంబ్లీ కి గైర్హాజరు అవుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ లీగల్ నోటీసులు పంపింది.ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస రెడ్డి ఈ నోటీసులు పంపారు. అసెంబ్లీ కి హాజరు కాని కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని ఫార్మర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్పాల్ కోరారు. అపోజిషన్ లీడర్గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని కేసీఆర్కు సభలో సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసులో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కేసీఆర్ పోరాటం చేయాలని నోటీసుల్లో సూచించారు. లేదంటే అసెంబ్లీకి రాని కేసీఆర్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, కేసీఆర్కు స్పీకర్ సమన్లు జారీ చేసి వివరణ కోరాలని పిటిషనర్ కోరారు. కేసీఆర్ సభకు హాజరుకాక పోవడమంటే రైతుల గొంగు నొక్కడమేనని స్పష్టం చేశారు.
కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు నిర్వర్తించారు. పదేండ్లు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పదేండ్ల కాలంలో పలు పథకాలు ప్రవేశపెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుహ్యంగా బీఆర్ఎస్ అధికారం కోల్పొయింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికల తర్వాత కాలుజారి పడ్డ కేసీఆర్ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. కాగా ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు కావస్తోన్న కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఒకేఒకసారి సభకు హాజరయ్యారు. ఆయన పూర్తిగా ఫాంహౌజ్ కే పరిమితమయ్యారు. కేసీఆర్ ను ప్రజల్లోకి రావాలని పలువురు కోరుతుండగా, అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నాయకులు పదే పదే కోరుతున్నా ఆయన స్పందించలేదు. తాజాగా ఫాంహౌజ్ లో జరిగిన ఒక సమావేశంలో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించడమే కాకుండా తాను కొడితే ఎలా ఉంటుందో తెలుసుకదా అంటూ కామెంట్ చేసి సంచలనం సృష్టించారు. తాజాగా లీడల్ నోటీసులతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.