అడ్డుకునే క్రమంలో హత్యచేసిన తల్లి
ముత్తారం మండలంలో కన్నతల్లిపై మృగంలా ప్రవర్తించిన దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ముత్తారం మండల ఎస్సై గోపతి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మహేష్ నరేష్ (33) గత కొద్ది రోజుల క్రితం భార్యతో విడాకులు కావడంతో మద్యానికి బానిసై తల్లిదండ్రులను ప్రతిరోజు మద్యానికి డబ్బులు ఇవ్వకపోతే ఇష్టవొచ్చినట్లుగా తిడుతూ కొడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవాడు.
ఈనెల 10న రాత్రి 11:30 కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో నరేష్ మద్యం సేవించి ఇంట్లో ఉన్న తల్లిని చేయి పట్టుకొని అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. అతడిని అడ్డుకునేందుకు తల్లి ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చేసేది ఏమీ లేక అతన్ని నెట్టివేసి అక్కడే దగ్గరలో ఉన్న రోకలిబండతో నరేష్ తల, నుదురు, చాతిపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో నరేష్ ను కుటుంబ సభ్యులు పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా పరిశీలించిన డాక్టర్లు అప్పటికే నరేష్ మృతి చెందాడని తెలిపారు. మృతుడి తండ్రి మహేష్ రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లి లక్ష్మీపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు మంథని సీఐ రాజు,ముత్తారం ఎస్సై గోపతి నరేష్ తెలిపారు.