Tuesday, April 22, 2025

బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి

  • బందిపోటు దొంగల్లాంటి కార్పొరేట్ అధిపతులతో మోడీ కుమ్మక్కై దేశ సంపదను విక్రయిస్తున్నారు
  • నాడు వంత పాడి…ఇప్పుడు గుండెలు బాదుకుంటున్న కెసిఆర్
  • తెలంగాణ ఆస్తి తెలంగాణ వెలుగు సింగరేణి

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ లక్డీకపూల్ లోని సింగరేణి భవన్ వద్ద జరిగిన ధర్నాలో లెఫ్ట్ పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలన్నారు. బొగ్గు బ్లాకులను నేరుగా సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ఆందోళనకు దిగారు. సింగరేణికి నామినేషన్ పద్ధతిలో గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. సింగరేణిని కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. సింగరేణి జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. సింగరేణిని కాపాడుకోవడుకోవడానికి అవసరమైతే తెలంగాణ బంద్ కు కూడా పిలుపునిస్తామని తెలిపారు.

సింగరేణిని కాపాడుకునేందుకు అవసరమైతే రాష్ట్ర బంద్ పిలుపునిస్తాం : కూనంనేని సాంబశివరావు
సింగరేణిని కాపాడుకోవడం కోసం పలు విధాలా ఉద్యమాలు కొనసాగిస్తామని, అవసరమైతే తెలంగాణ బంద్ కూడా పిలుపునిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభాపక్షం నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు బాధ్యతగా తమకు మద్దతుగా నిలబడాలన్నారు. దేశ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెట్టే కేంద్రంలోని బిజెపి విధానాలను నిరసించాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గు వేలం పాటను రద్దు చేసి, బొగ్గు బ్లాకులను నేరుగా సింగరేణి కాలరీస్ అప్పగించాలని డిమాండ్ చేస్తూ వామపక్షా పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీకాపూల్ సింగరేణి భవన్ ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వామపక్ష నాయకులు కూనంనేని సాంబశివరావు, పశ్యపద్మ,ఈటి.నర్సింహ, అంజయ్య నాయక్ (సిపిఐ),డిజి నరసింహారావు , సాగర్, ఎం.శ్రీనివాస్ (సిపిఐ(ఎం)), గుమ్మడి నరసయ్య (సిపిఐ మాస్ లైన్ ),జెవి చలపతి రావు, సాధినేని వెంకటేశ్వర రావు ( సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ),ధర్మతేజ (ఎస్ పాల్గొన్నారు.

ధర్నానుద్దేశించి కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ దేశాన్ని కాపాడాల్సిన వాళ్లే దొంగకు తాళం చెవి ఇస్తే, ఆ దొంగ ఎంత భద్రతగా కాపాడుతాడో ప్రధాని మోదీని చూస్తే అర్థం అవుతుందన్నారు. బందిపోటు దొంగల్లాంటి కార్పొరేట్ అధిపతులతో మోదీ కుమ్మక్కై దేశ సంపదను విక్రయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ గుండె చప్పుడు , తెలంగాణ ఆస్తి తెలంగాణ వెలుగు సింగరేణిని కూడా కార్పొరేట్ అధిపతులకు అప్పగించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. సింగరేణి పెద్ద సంస్థ అని,దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏ ప్రభుత్వానికి కూడా సింగరేణి సంస్థ లాంటిది లేదన్నారు. బొగ్గుగనులు మనవి, బొగ్గును కనిపెట్టింది సైంటిస్టులని, ఆ బొగ్గును కాపాడేందుకు శేషగిరి, కొమురయ్య, పర్సా సత్యనారాయణ లాంటి వారు ఎందరో కృషి చేశారు. అనేక మంది ఉమ్మడి కమ్యూనిస్టులు సింగరేణిని కాపాడు కుంటూ వచ్చారన్నారు. పావలా జీతం దగ్గర నుంచి గౌరవ ప్రదమైన వేతనాలు ఉండేలా సింగరేణిని ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థగా తీర్చిదిద్డారని కూనంనేని గుర్తు చేశారు. ఆ సింగరేణి ద్వారానే దక్షిణాధి రాష్ట్రాలలో కరెంటు సరఫరాకు అయ్యే బొగ్గు మొత్తం సింగరేణి నుండి సరఫరా అయ్యే పరిస్థితి ఉన్నదన్నారు.

నాడు వంత పాడి…ఇప్పుడు గుండెలు బాదుకుంటున్న కెసిఆర్ …
సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ఎంఎంఆర్ చట్టాన్ని 2015లో పొందపర్చినప్పుడు , కెసిఆర్ కూడా వారికి వంత పాడుతూ చేతులెత్తారని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఏ రాష్ట్రంలోని గనులనైనా తీసుకునేలా చట్టాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఇటువంటి భయంకరమైన చట్టాన్ని తీసుకురావడంలో మోదీ, కెసిఆర్ ఇద్దరూ నాడు చేతులు కలిపారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అదే కెసిఆర్ ఇప్పుడు గుండెలు బాదుకుంటూ ఆ చట్టలం అంశంలో తమ పాత్ర లేదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్ ఎంత నటించినప్పటికీ మన చేతుల్లోని చట్టాన్ని కేంద్రం చేతిలో పెట్టారన్న అంశం ప్రతి ఒక్కరికీ తెలిసిందేనన్నారు. సింగరేణికి ఎంతో భవిష్యత్తు ఉన్నదనే ఉద్దేశంతోనే 1973లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కాలంలో దీనిని ప్రభుత్వ రంగంలోనికి మార్చారని, దీని వెనకాల ఏఐటియుసి , సిఐటియూ ఇతర విప్లవ సంఘాలు పోరాటాలు ఉన్నాయన్నారు. ఇటువంటి సింగరేణిని ప్రైవేటీకరణ చేసే బాధ్యతను కేంద్రానికి ఎవరిచ్చారని కూనంనేని నిలదీశారు. ఒకప్పుడు సింగరేణిలో 1,30,000 మంది ఉన్న కార్మికుల సంఖ్య ప్రస్తుతం 42 వేలకు చేరిందని, దీనిని 20 వేలకు చేయాలనే కుట్రలు పన్నుతున్నారని కూనంనేని మండిపడ్డారు.

 

సిఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీపర్యటనలో ప్రధాని మోదీని కలిసి ఒక వినతి పత్రం అందజేశారని, అలాంటి దరఖాస్తులతో మోదీ లొంగుతాడా? అని అన్నారు. డిజి నరసింహారావు మాట్లాడుతూ సింగరేణి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేక అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తాము ప్రైవేటీకరణ చేయడంలేదని, 51 శాతం రాష్ట్రానిదే అని ఒక సారి, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు కట్టబడి పని చేస్తామని మరో సారి మాట్లాడుతున్నారని తెలిపారు. సింగరేణిని కాపాడుకునేందుకు మరిన్ని సమరశీల పోరాటాలు చేయాల్సిన పరిస్థితి మరో సారి వస్తోందన్నారు. గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనవద్దని కోరారు.

ఎవరొచ్చి వేలం పాడుతారో అదీ చుద్దామన్నారు. జెవి చలపతిరావు, సాధినేని వెంకటేశ్వర రావు మాట్లాడుతూ వామపక్ష పార్టీలుగా అందరం కలిసి సింగరేణి ని కాపాడుకునేందుకు పోరాడుదామన్నారు. దఫదఫాలుగా ప్రతి రోజూ ఉద్యమాన్ని కొనసాగిద్దామని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ యూసుఫ్, ,ఎన్ ఎఫ్ ఐ డబ్లు నాయకురాలు జ్యోతి, సిపిఐ నాయకులు కాంపల్లి శ్రీనివాస్, ఎఐఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు చైతన్య యాదవ్ , ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com