అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్
పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఇప్పటికే పాకిస్థానీల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో షా ఫోన్లో మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో పాకిస్థాన్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించేయాలని ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నగరంలో 208 మంది పాక్ జాతీయులు ఉన్నట్లు గుర్తించారు. వారందరి వివరాలను సేకరించారు. రెండు రోజుల్లో నగరాన్ని వీడి తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించారు.
పెహల్గామ్ ఉగ్ర దాడి దరిమిలా పాకిస్థాన్పై తీసుకున్న ప్రతీకార చర్యల కొనసాగింపుగా తక్షణమే పాకిస్థానీలకు వీసా సేవలను నిలిపివేస్తున్నట్లు భారత్ గురువారం ప్రకటించింది. పాకిస్థానీలకు జారీ చేసిన వీసాలన్నీ ఏప్రిల్ 27 నుంచి రద్దయినట్లేనని విదేశాంగ శాఖ ప్రకటించింది. పాక్ జాతీయులకు జారీచేసిన మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కేంద్రం తెలిపింది. వీసాల గడువు ముగిసేలోగా దేశంలో ఉన్న పాక్ జాతీయులందరూ భారత్ను వీడాలని ప్రభుత్వం ఆదేశించింది. పాక్లోని భారతీయులందరూ త్వరగా దేశానికి రావాలని కోరింది.