ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్థాన్కు టర్కీ బహిరంగంగా మద్దతు పలకడం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ‘బ్యాన్ టర్కీ’ ఉద్యమం పలు ప్రాంతాల్లో ఊపందుకుంది. ముఖ్యంగా, మహారాష్ట్రలోని పుణె నగరంలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండగా, అక్కడి వ్యాపారులు టర్కీ యాపిల్స్ను బహిష్కరించారు.
పుణెలోని పండ్ల వ్యాపారులు టర్కీ నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్ను విక్రయించకూడదని నిర్ణయించారు. దీంతో స్థానిక మార్కెట్లలో టర్కిష్ యాపిల్స్ దాదాపుగా కనుమరుగయ్యాయి. కేవలం వ్యాపారులే కాకుండా, సాధారణ పౌరులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై, టర్కీ యాపిల్స్కు బదులుగా ఇతర దేశాల నుంచి వస్తున్న లేదా స్వదేశీ పండ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ బహిష్కరణ పుణె పండ్ల మార్కెట్పై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని అంచనా.
సాధారణంగా టర్కిష్ యాపిల్స్ ద్వారా సీజన్లో సుమారు రూ.1000 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని, ఇప్పుడది దెబ్బతింటుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదని, దేశ సాయుధ బలగాలకు, ప్రభుత్వానికి తమ సంఘీభావం ప్రకటించే చర్య అని వ్యాపారులు చెబుతున్నారు.