Sunday, April 13, 2025

ఎంఐఎంను గెలిపిస్తే మీ పని ఖతం

డివిజన్ ప్రజలను, ఫ్యామిలీని అడిగాకే వోటేయండి..
రాజాసింగ్ బీజేపీ కట్టర్ కార్యకర్త.. మా మధ్య విబేధాల్లేవ్..
ప్రెస్ మీట్లు తప్ప బీఆర్ఎస్ చేసిన పోరాటాలేమిటి?
రాహుల్ మెప్పుకోసమే మోదీపై సీఎం అడ్డగోలు ఆరోపణలు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లరా… మీరు మళ్లీ వొచ్చేసారి కార్పొరేటర్లుగా గెలవాలనుకుంటున్నారు కదా? మీకు వోట్లేసి గెలిపించేది హిందువులే తప్ప అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలు కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎంఐఎం అభ్యర్ధికి వోటేస్తే… హిందు సమాజమంతా ఒక్కటై మిమ్ముల్ని వోడించడం తథ్యం’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. హిందూ ఏక్తా యాత్ర, హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ సమాజమంతా ఏ విధంగా ఏకమవుతుందో ఒక్కసారి గుర్తుంచుకుని వోటేసే ముందు ఆలోచించుకోవాలని సూచించారు. వోటేసే ముందు కార్పొరేటర్లంతా తమ తమ డివిజన్ ప్రజలతోపాటు కుటుంబ సభ్యుల మనోభావాలను తెలుసుకుని వోటేయాలని కోరారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గోషామహల్ నియోజకవర్గంలోని ఆకాశ్ పురి హనుమాన్ ఆలయానికి విచ్చేసిన బండి సంజయ్ కు స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజాసింగ్ తో కలిసి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రాజాసింగ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆకాశ్ పురి హనుమాన్ టెంపుల్ పవర్ పుల్ ఆలయం. . హిందూ సమాజ సంఘటిత శక్తిని ప్రదర్శించేలా రాజాసింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గొప్ప ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈరోజు పండుగ వాతావరణంలో హనుమాన్ ర్యాలీ నిర్వహిస్తారు. సంఘ విద్రోహ శక్తుల నుంచి కాపాడే దైవం హనుమంతుడు అని బండి సంజయ్ అన్నారు.

హెచ్ సీయూ భూములపై కేటీఆర్ ఆరోపణలపై స్పందిస్తూ..  ‘కేటీఆర్ కు నిజంగా దమ్ముంటే, ఆధారాలుంటే ఆ బ్రోకర్ ఎవరో బయటపెట్టొచ్చు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటే అని వ్యాఖ్యానించారు.  కేటీఆర్ కు కళ్లు మూసుకుపోయాయని, రేవంత్ రెడ్డి సర్కార్ పై పోరాడుతున్నది బీజేపీయే కదా? 6 గ్యారంటీలపై అడుగడుగునా నిలదీస్తోంది మేమే కదా? హెచ్ సీయూ భూములపై పోరాడి జైలుకు పోయాం. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఏనాడైనా 6 గ్యారంటీలపై కొట్లాడిందా? .. వాకౌట్ చేసిందా?… ప్రతిరోజు 6 గ్యారంటీల హామీల ఎగవేతపై కాంగ్రెస్ ను నిలదీస్తోంది తానేనని అన్నారు.  రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2500లు, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, 2 లక్షల ఉద్యోగాలపై నిరంతరం మాట్లాడింది, పోరాడింది బీజేపీయే.. కానీ మీరేనాడైనా పోరాడారా? అంతెందుకు హెచ్ సీయూ భూములపై పోరాడి జైలుకు పోయింది ఏబీవీపీ కార్యకర్తలే. మీరు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప పోరాడారా? మీడియా వాళ్లను పట్టుకుని కేటీఆర్ ‘‘వాడెవడో పేపరోడు, వీడెవడో టీవోడు’ ఆ బీజేపోడు అంటూ అడ్డగోలుగా మాట్లాడుతుంటే జర్నలిస్టులు స్పందించరా? కేటీఆర్ ను ప్రజలు వోడగొట్టినా ఇంకా అహంకారం తగ్గలేదు. కేసీఆరే ఇంకా అధికారంలో ఉన్నాడని అనుకుంటున్నడేమో.. ఆయన అహంకారం దించుతామని పేర్కొన్నారు.

‘రేవంత్ రెడ్డి మోదీపై చేస్తున్న విమర్శలను మీడియా ప్రస్తావించగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఆయన మెప్పు పొందేందుకు మోదీపై ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. కేసీఆర్ కూడా గతంలో ఇలాగే మోదీపై అడ్డగోలుగా మాట్లాడితే ఏమైంది?… తెలంగాణ ప్రగతికి సహకరిస్తానని కేంద్రం చెప్పినా వినకుండా అన్యాయం చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పంథాలో నడుస్తోంది. ఆ పార్టీకి కూడా ఆదే గతి పడుతుంది. హెచ్ సీయూ భూములపై మాట్లాడుతూ.. ఈ అంశం కోర్టులో ఉంది. ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మనీయబోం. కోర్టులపై మాకు పూర్తి నమ్మకం ఉందన్నారు.  ఇక రేషన్ ద్వారా అమ్మే బియ్యంలో ఒక్క కిలోకు రూ.37లు ఇస్తోంది కేంద్రమే. ఆ మాట సంబంధిత మంత్రి కూడా ఒప్పుకున్నారు. మరి కాంగ్రెస్ బియ్యం ఎట్లా అవుతాయి. కాంగ్రెస్ ఎన్ని చెప్పినా… రేషన్ షాపులో ఇచ్చేది మోదీ బియ్యమే తప్ప రేవంత్ రెడ్డి బియ్యం, ఉత్తమ్ బియ్యం, కాంగ్రెస్ బియ్యం అని చెప్పడం లేదు. ఎందుకంటే ఏటా వేల కోట్ల రూపాయలు బియ్యం కోసం కేంద్రం ఖర్చు చేస్తోంది. ఒకవేళ రేషన్ బియ్యానికి సంబంధించి కేంద్ర నిధులు అక్కర్లేదని అనుకుంటే దమ్ముంటే కేంద్రానికి లేఖ రాయాలి. ‘‘మీ బియ్యం మాకు అవసరం లేదు. అందుకోసం కేంద్రం పైసలియ్యాల్సిన అవసరం లేదు. ఆ బియ్యానికి అయ్యే పైసలన్నీ మేమే భరిస్తాం. ఖర్చు పెడతాం’’ అని కేంద్రానికి లేఖ రాసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా బండి సంజయ్  ప్రశ్నించారు.

బీజేపీతో రాజాసింగ్ కు విబేధాలున్నాయంటూ వొస్తున్న వార్తలపై అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిస్తూ.. రాజాసింగ్ బీజేపీ సీనియర్ నేత. వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న నాయకుడు. 2018లో మా ఏకైక ఎమ్మెల్యే. సమాజ ధర్మం, బీజేపీ సిద్ధాంతాల కోసం పనిచేసే కట్టర్ కార్యకర్త రాజాసింగ్. హిందుత్వం కోసం నిరంతరం పోరాడే నాయకుడు. ఆయనతో ఎలాంటి విబేధాల్లేవు. బీజేపీలో అందరం కలిసే ఉంటున్నామని తెలిపారు.  ఇప్పటికే మేం తెలంగాణలో 50 శాతానికిపైగా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాం. 3 ఎమ్మెల్సీలు మావే. ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుస్తోంది కూడా బీజేపీయే. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీలు అభ్యర్థులనే నిలబెట్టకపోవడమే నిదర్శం కదా? ఇంకా ఆయన అడుగుపెట్టనిచ్చేదేముంది? జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న బలమేంది? గెలుస్తుందనే నమ్మకం ఉందా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. మా బలమేందో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తేలిపోయింది.

మాకు బలం ఉంది కాబట్టే ఇటీవల  2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బలం లేదు కాబట్టే పోటీ చేయడానికి కూడా అభ్యర్థులే దొరకడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు..  మీ గుండెపై చేయి వేసుకుని మీ కుటుంబ సభ్యులను అడగండి. ఎంఐఎం పార్టీకి వోటేయమని అడగండి. మీరంతా మళ్లీ వొచ్చేసారి కార్పొరేటర్లుగా గెలవాలనుకుంటున్నారు కదా? మరి మీకు హిందువుల వోట్లు వద్దా? అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలు మిమ్ముల్ని గెలిపిస్తారనుకుంటున్నారా? లేక రేవంత్ రెడ్డి, కేటీఆర్ గెలిపిస్తారనుకుంటున్నారా? మిమ్ముల్ని గెలిపించేది హిందువులే కదా? ఒకవేళ పొరపాటున ఎంఐఎం అభ్యర్థికి వోటేస్తే హిందు సమాజం క్షమించదు. అని బండి సంజయ్ అన్నారు.  హిందూ ఏక్తా యాత్ర, హనుమాన్ జయంతి, వినాయక చవితి సందర్భంగా హిందూ సమాజమంతా ఏకమవుతుంది కదా… పొరపాటున మీరు ఎంఐఎంను గెలిపిస్తే హిందువులంతా ఒక్కటై మిమ్ముల్ని ఓడించడం తథ్యమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com