‘‘కేటీఆర్ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉంది…కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసు…నాతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించిన, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదు. రేవంత్పై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్తో జరగబోయేది యుద్దమే. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్దం చేస్తాం’’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శనివారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో బండి మాట్లాడుతూ… బీఆర్ఎస్తో బీజేపీ చర్చలు ఫేక్ న్యూస్ అని అన్నారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. కవిత బెయిల్కు, బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. సిసోడియాకు బెయిల్ వస్తే… బీజేపీకి సంబంధముందా అని నిలదీశారు. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదన్నారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్లకు నేటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్కు కొమ్ముకాసిన ఐఏఎస్లకే మళ్లీ మంచి పోస్టింగులిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు తేడా లేకుండా పోయిందన్నారు. అతి తక్కువ టైంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సే అని వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అని స్పష్టం చేశారు. పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా ప్రోత్సహక నిధులివ్వడం లేదన్నారు. కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయన్నారు.
మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలే మా బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పుకొచ్చారు. ఏ పార్టీ గెలిస్తే పంచాయతీలు అభివృద్ధి అవుతాయనే గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలన్నారు. పంచాయతీలకు కేంద్రమే నిధులిస్తోందని హరీష్ రావు ఇప్పటికైనా చెప్పడం శుభ పరిణామమన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు దందా బాధ్యతను కాంగ్రెస్ నేతకు అప్పగించిందన్నారు. తమ్ముడి కోసమే రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారనడం సరికాదన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలని హితవుపలికారు. కాంగ్రెస్లో లుకలుకలు మొదలైనయన్నారు. ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్కు ప్రజలు ఐదేళ్ల తీర్పు ఇచ్చారని.. ఐదేళ్లు అధికారాన్ని ఉంచుకుంటారా? వదులుకుంటారా? అనేది ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉందన్నారు.
పాతబస్తీలో రోహింగ్యాలు
‘‘పాతబస్తీలో రోహింగ్యాలున్న మాట వాస్తవమే కదా… ఆనాడు డిప్యూటీ సీఎం మహమూద్ అలీయే రిబ్బన్ కటింగ్ చేశారు కదా? అసదుద్దీన్ ఒవైసీ.. ఎన్ని వక్ప్ బోర్డు భూములను కాపాడారో సమాధానం చెప్పాలి. ఒకచోట ఊరు ఊరంతా వక్ఫ్ బోర్డు భూములేనని చెప్పడం ఎంత వరకు న్యాయం? వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి ఎంత మంది పేద ముస్లింలకు ఇచ్చారో చెప్పగలరా? ప్రైవేట్ భూములు కూడా చాలా చోట్ల వక్ఫ్ బోర్డులో ఉన్నాయి… పూర్తి విచారణ చేస్తే వివరాలు బయటకొస్తాయి. గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే… వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. నేను అందరి మనిషిని… కొందరు కాదనుకుంటే నేనేం చేయగలను. పార్టీకి, శాసనసభ్యులకు మధ్య గ్యాప్ ఉందనేది సరికాదు. నా పార్లమెంట్ పరిధిలో 80 శాతానికిపైగా ఓట్లు నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను త్వరలోనే సన్మానిస్తా. రాష్ట్ర అధక్ష మార్పు జాతీయ అధ్యక్షులు నడ్దా చూసుకుంటారు. హైకమాండ్ నిర్ణయమే మాకు శిరోధార్యం’’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.