పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ గట్టిదెబ్బ వేసింది. అర్ధరాత్రి తర్వాత మెరుపుదాడి చేసి తొమ్మిది స్థావరాలను మట్టుబెట్టింది. ఆపరేషన్ సిందూర్లో ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులను వాడినట్లు తెలుస్తోంది. నిజానికి ఇలాంటి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకం ఆయుధాలు వాడారన్నది దళాలు ఎప్పడూ కూడా బహిర్గతం చేయవు. కానీ, అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా నిపుణులు ఓ అంచనాకు వస్తుంటారు. గగనతలం నుంచి గగనతలంలోకి 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిలోని లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకోగలిగే క్రూయిజ్ మిసైల్స్, 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కొట్టగలిగే సామర్థ్యం ఉన్న హామర్స్, లక్షిత ప్రాంతాలపై ఎగురుతూ గాలిలో ప్రయాణించే డ్రోన్లను వాడినట్లు చెబుతున్నారు.
ఆత్మాహుతి డ్రోన్లు
ఆపరేషన్ సిందూర్లో త్రివిధ దళాలు ఆత్మాహుతి డ్రోన్లను విస్తృతంగా వినియోగించినట్లు తెలుస్తోంది. అవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని విరుచుకుపడతాయి. లక్ష్యాలను కచ్చితంగా అనుకున్నట్లు గుర్తిస్తాయి. వాటిలో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. అలాంటి డ్రోన్స్ భారత్ దగ్గర చాలానే ఉన్నాయి.
స్ట్రామ్ షాడో
స్కాల్ప్ క్షిపణులను స్ట్రామ్ షాడో అని కూడా పిలుస్తుంటారు. ఫ్రాన్స్ అభివృద్ధి చేసిన వాటికి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంటుంది. అందుకే వాటిని శత్రుదేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు ఉపయోగిస్తుంటారు. యుద్ధ విమానాలపై నుంచి కూడా కొన్ని ప్రయోగిస్తుంటారు.
స్మార్ట్ బాంబు హ్యామర్
హ్యామర్ బాంబులను ధృడంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు వినియోగిస్తారు. స్మార్ట్ బాంబ్ కోవలోకి వచ్చే వాటిని లక్ష్యానికి 50-70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించవచ్చు. ఎంత ఎత్తు నుంచి ప్రయోగించిన విషయంపై దాని సత్తా ఆధారపడి ఉంటుందట. అలా ఈ మూడు రకాల అత్యాధునిక ఆయుధాలను వాడినట్లు తెలుస్తోంది. అయితే, పాక్లో ధ్వంసం చేయాల్సిన ఉగ్ర స్థావరాలపై దాడులను ఎయిర్ఫోర్స్, ఆర్మీ, నేవీ సమన్వయం చేసుకొన్నాయి. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బవహల్పూర్, మురిద్కేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన స్వీకరించిందని సమాచారం. మిగిలిన వాటి సంగతి ఆర్మీ చూసుకుంది. నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన పీ8ఐ విమానాలు, ఎంక్యూ9 డ్రోన్లతో సహకారం అందించిందని తెలుస్తోంది.
ఎక్కడెక్కడ దాడి చేశారంటే
బహవల్పూర్, మురిడ్కే, గుల్పూర్, సవాయి, కోట్లి, సర్జల్, బర్నాలా, మెహమూనా ప్రాంతాలపై ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది. బహవల్పూర్ జైషే ప్రధాన కార్యాలయంగా, ప్రధాన దాడులకు ప్రణాళికా కేంద్రంగా ఉండేదని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
మురిద్కే ముంబైపై 26/11 దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన లష్కరే స్థావరం.
2023, 2024 మధ్య జమ్మూ కశ్మీర్ లోని రాజౌరి, పూంచ్ లలో దాడులకు గుల్పూర్ స్థావరంగా ఉంది.
సవాయి శిబిరం.. పహల్గామ్ ఉగ్రదాడితో సహా భారతదేశంలో జరిగిన పలు దాడులతో సంబంధం ఉన్న లష్కర్ శిబిరం. కోట్లీ ఉగ్రవాద శిక్షణా కేంద్రంగా ఉంది.
సర్జల్, బర్నాలా ఎల్ఓసి, అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఉగ్రవాద శిబిరాలు. చొరబాటు కోసం ఉపయోగిస్తుంటారు.