కేసు నమోదు చేశామని చెప్పిన తెలంగాణ డీజీపీ
సోషల్ మీడియా.. ఇప్పుడు ఇది లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేము. ఐతే సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సోషల్ మీడియా స్వేచ్ఛను కొంతమంది దుర్వినియోగం చేయడం ఆందోళనకలిగిస్తోంది. కొన్ని కొన్ని సార్లు కొందరు ఇష్టానుసారంగా, అడ్డూ అదుపు లేకుండా, విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్ట్ లు, వీడియోలు పెడుతున్నారు. ఇలాంటి అనుచిత వ్యవహారాల కొంతమందికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
తాజాగా సోషల్ మీడియోలో వచ్చిన ఓ వీడియోను చూసి ప్రముఖ టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో రాటు డీజీపీ సైతం స్పందించారు. అసలేంజరిగిందంటే.. ప్రణీత్ హనుమంతు అనే ఓ తెలుగు యూట్యూబర్ ఆన్లైన్లో ఓ డిబేట్ను మొదలుపెట్టాడు. ఇందులో కొంతమంది వ్యక్తులు పాల్గొన్నారు. ఈ క్రమంలో తండ్రీ, కూతుళ్ల మధ్య సాగే ఓ వీడియోపై వాళ్లంతగా ఇష్టానుకారంగా మాట్లాడారు. వినడానికి ఇబ్బందికరమైన, అసభ్య కామెంట్స్ వికృతానందం పొందారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నటుడు సాయి ధరమ్ తేజ్ అనుకోకుండా ఈ వీడియోను చూసి తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పేరెంట్స్ తమ పిల్లల్ని కాపాడుకోవాలంటూ విజ్ఙప్తి చేస్తూ సుదీర్గంగా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు సాయి ధరమ్ తేజ్. దీనిపై ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీం భట్టి విక్రమార్క స్పందించారు. ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయి ధరమ్ తేజ్ కు ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో పిల్లల ఫొటోలు, వీడియోల దుర్వినియోగాన్ని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
అంతే కాదు ఈ వీడియోపై తెలంగాణ పోలీసులు సైతం స్పందించారు. అసభ్యకరమైన రీతిలో మాట్లాడిన సదరు యూట్యూబర్ పై వెంటనే కేసు నమోదు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు డీజీపీ. సాయి ధరమ్ తేజ్ పోస్ట్ను రీ ట్వీట్ చేస్తూ తెలంగాణ డీజీపీ అధికారిక పేజీ నుంచి ఈ పోస్ట్ చేశారు. యూట్యూబ్ లో అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. చిన్న పిల్లలను, ఆడపిల్లలను కాపాడేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని ఈ సందర్బంగా స్పష్టం చేశారు పోలీసులు.