Sunday, September 29, 2024

‘ధరణి’ వెబ్‌సైట్ స్థానంలో భూ భారతి పోర్టల్

  • ‘ధరణి’ వెబ్‌సైట్ స్థానంలో భూ భారతి పోర్టల్
  • కొత్త ఆర్‌ఓఆర్ చట్టం కోసం ధరణి కమిటీ సభ్యుల కసరత్తు
  • భూచట్టాలన్నీ ఒకే గొడుగు కిందకు…
  • త్వరలోనే సిఎం రేవంత్‌కు, రెవెన్యూ మంత్రి పొంగులేటికి
  • కొత్త ఆర్‌ఓఆర్ చట్టం ముసాయిదా సమర్పించే అవకాశం

‘ధరణి’ వెబ్‌సైట్ స్థానంలో భూ భారతి పోర్టల్‌ను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గతంలో 2020లో ధరణి పోర్టల్‌ను అప్పటి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఆర్‌ఓఆర్ చట్టం అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ఏమీ లేకపోవడంతో చట్టం తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయినట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ధరణి చట్టం తీసుకొచ్చినప్పటికీ మండల రెవెన్యూ, డివిజనల్ రెవెన్యూ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఎలాంటి సమస్యలు పరిష్కరించాలో, ఏ స్థాయి అధికారికి ఏయే అధికారాలు ఉంటాయన్న మార్గదర్శకాలను సైతం అప్పటి ప్రభుత్వం పొందుపరచలేదు. దీనికి తోడు రెవెన్యూ చట్టాలు పదుల్లో ఉండడంతో భూ సమస్యలు పరిష్కరించేందుకు ఒక చట్టం కింద చర్యలు తీసుకున్నప్పుడు మరో చట్టం అడ్డు వస్తున్నట్లు ధరణి కమిటీ పరిశీలనలో గుర్తించారు. దీంతో భూచట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీంతోపాటు పార్ట్-బి, సాదాబైనామాలకు చెందిన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించి భూహక్కులు కల్పించాలంటే కొత్తగా ఆర్‌ఓఆర్ చట్టం తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే కొత్త ఆర్‌ఓఆర్ చట్టం సిద్ధం

అందులో భాగంగా కొత్తగా ఆర్‌ఓఆర్ చట్టం తీసుకొచ్చేందుకు ధరణి కమిటీ సభ్యులు కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చట్టానికి సంబంధించిన అంశాలను రెవెన్యూ మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లిన అనంతరం దానిని అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు ధరణి కమిటీ సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ప్రైవేటు సంస్థ ఆధీనంలో ఉన్న ధరణి పోర్టల్ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే చట్టం రూపకల్పనలో నిమగ్నమైన ధరణి కమిటీ సభ్యులు ఇప్పటికే కొత్త ఆర్‌ఓఆర్ చట్టాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించిన తర్వాత దానిని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందచేయనున్నట్టుగా సమాచారం. అనంతరం దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి ఆమోదముద్ర వేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

లక్షలాది మంది పట్టాదారులకు పాసు పుస్తకాలు రాక…

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా చోటు చేసుకున్న తప్పిదాల కారణంగా పట్టాదారు రైతులు కూడా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. లక్షలాది మంది ధరణి బాధితులు సమస్యల పరిష్కారం కోసం వేచి చూస్తున్నారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత లక్షలాది మంది పట్టాదారు పాస్ పుస్తకాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ పలుమార్లు సమావేశమై చర్చించిన తర్వాత భూ సమస్యలను పరిష్కరించేందుకు గత మార్చి మొదటి వారంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో భూసమస్యలు ఉత్పన్నమయ్యాయి. కొత్త తరహా పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.

ఇతర భూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే దిశగా చర్యలు

ధరణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం, మరో వారం, పది రోజుల్లో లక్షకు పైగా రైతు సమస్యలు పరిష్కారం చేయనుంది. మిగిలిన సమస్యల పరిష్కారానికి వివిధ రకాల అడ్డంకులు ఎదురవుతుండడంతో ధరణి కమిటీ లోతైన అధ్యయనం చేస్తోంది. వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వం తెచ్చిన ఆర్‌ఓఆర్ చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా పదుల సంఖ్యలో ఉన్న ఇతర భూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే దిశలో చర్యలు తీసుకుంటోంది.

లక్ష మంది రైతుల భూములు ఆన్‌లైన్‌లో….

గత ప్రభుత్వంలోనే భూ సమస్యల పరిష్కారానికి దాదాపు 2.46 లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి మొదటి వారంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మరో 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులు మూడు లక్షలు దాటాయి. ధరణి కమిటీ సూచన మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇందులో లక్షకుపైగా సమస్యలు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తి చేసుకుని సిసిఎల్‌ఏకు చేరినట్లు ధరణి కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించి ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఇది పూర్తయితే కానీ, ఆ లక్ష మంది రైతులకు చెందిన భూములు ఆన్‌లైన్‌లో కనిపించవు. వారం, పది రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్నవి, కుటుంబ తగాదాలతో పెండింగ్‌లో ఉన్నవి పక్కన పెడితే టిఎం-33 మోడ్యూల్ కింద పరిష్కరించాల్సిన భూ సమస్యలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular