- తెలంగాణను గుజరాత్ మాదిరిగా అభివృద్ధి చేయాలి
- పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో 16 మంది ఎంపిలు నిధుల కోసం గళమొత్తాలి
- భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్
ప్రధాని మోడీ తెలంగాణపై వివక్ష చూపకుండా తెలంగాణను గుజరాత్ మాదిరిగా అభివృద్ధి చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు, బిజెపి ఎంపిలు ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించడమే తప్ప తెలంగాణ ప్రజలకు ఏం అభివృద్ధి చేస్తామో చెప్పడం లేదని ఆయన ఆరోపించారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లోని మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్ , నేషనల్ డిజైన్ సెంటర్లతో పాటు స్మార్ట్ సిటీస్లైన వరంగల్, కరీంనగర్లకు సంబంధించి ఈనెల 22 నుంచి జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్కు చెందిన 8 మంది ఎంపిలతో పాటు బిజెపికి చెందిన 8 మంది ఎంపిలు కూడా మాట్లాడాలని ఆయన కోరారు. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 2019 నుంచి 2024 సుమారుగా పలు సమస్యలు, పెండింగ్లో ఉన్నాయని ఎంపి చామల ఆరోపించారు.
కేంద్రం సింగరేణిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, దీనిపై కూడా పోరాడుతామన్నారు. హైదరాబాద్ ఐటిఐఆర్ కోసం 49 వేల ఎకరాల భూమిని ఇస్తామని చెప్పామని, ఐఐహెచ్టిని పోచంపల్లి లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు. ఐఐఎం గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా రాష్ట్రానికి రూ.2,390 కోట్లు రావాల్సి ఉండగా అందులో సగం మాత్రమే వచ్చాయని, మిగిలిన నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నెల 22 నుంచి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో 16 మంది ఎంపిలు తెలంగాణ అభివృద్ధి కోసం గళమెత్తాలని ఆయన కోరారు. ఆర్ఆర్ఆర్ను త్వరగా పూర్తి చేయాలన్నారు. నిరుద్యోగ సమస్య తగ్గుతుందని భువనగిరి నుంచి చిట్యాల, చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వయా షాద్ నగర్ రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలని ఆయన కోరారు.