హిండెన్బర్గ్ వ్యవహారంపై ఏఐసీసీ సమావేశంలో చర్చ
వివరాలను మీడియాకు వెల్లడించిన పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్
అదానీ-సెబీకి సంబంధం ఉన్న హిండెన్బర్గ్ వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలవడంపై ఏఐసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చించామని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ కుంభకోణంలో మోదీ ప్రమేయంపై ఆరోపణలు గుప్పిస్తూ, ప్రధానంగా తాము రెండు అంశాలపై దేశవ్యాప్త ఆందోళనలకు నిర్ణయించామని చెప్పారు. కాగా హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ-హిండెన్బర్గ్ వివాదం వేడెక్కుతుంది.
సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ అండియా సెబి చీఫ్ మాధబి పూరి బచ్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాల వద్ద నిరసలకు దిగాలని నిర్ణయించింది. అదానీ గ్రూప్ కంపెనీలపై వొచ్చిన ఆరోపణలకు సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
మంగళవారం నాడిక్కడ జరిగిన వి•డియా సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జులు, పీసీసీ అధ్యక్షులతో మంగళవారం సమావేశం జరిగింది. సమావేశ వివరాలను వేణుగోపాల్ మీడియాకు వివరిస్తూ… ప్రధాన మంత్రి పూర్తి ప్రమేయం ఉన్న అదానీ మెగా స్కామ్పై జేపీసీ ఏర్పాటు చేయాలని పార్టీ డిమాండ్ చేసిందని తెలిపారు. ఫైనాన్షియల్ మార్కెట్ రెగ్యులేషన్ విషయంలో పూర్తిగా మోదీ రాజీపడ్డారని ఆరోపించారు. సెబీ బాస్ రాజీనామా చేయాలనేది కూడా తమ మరో డిమాండ్ అని చెప్పారు. దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా ఆయా నగరాల్లోని ఈడీ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు.