ప్రాణాలు కోల్పోయిన బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త
బ్రిటన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన ప్రయాణిస్తున్న విలాసవంతమైన నౌక సముద్రంలో మునిగిపోయింది. సదరు బిజినెస్ మ్యాన్ తో పాటు ఆయన 18 ఏళ్ల కుమార్తె సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన ఇటలీలోని సిసిలీ తీరం సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఈ నౌక ఆగస్టు 14న ఇంటలీలోని సిసిలీ పోర్టు నుంచి 10 మంది సిబ్బంది 12 మంది ప్యాసింజర్లు సహా మొత్తం 22 మందితో బయలుదేరింది.
సోమవారం తెల్లవారుజామున పోర్టిసెల్లో తీరానికి చేరుకుంటున్న సమయంలో ప్రతికూల వాతావరణం, భయంకరమైన తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. 5 గంటల సమయంలో భారీ అల తాకడంతో నౌక ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి మునిగిపోయిందని అధికారులు తెలిపారు. నౌక ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. సముద్ర ఉపరితలం నుంచి 50 అడుగుల లోతులో నౌక ఉన్నట్టు గుర్తించిన డైవర్లు.. లోపలి ఉన్నవారి కోసం గాలించారు. నౌకలో ఉన్న వారిలో 15 మంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఐతే దురదృష్టవశాత్తూ దిగ్గజ వ్యాపారవేత్త లించ్ తో పాటు ఆయన కూతురు హన్నా లించ్ జాడ కనిపించలేదు. టెక్ దిగ్గజ సంస్థ అటానమీ కార్పొరేషన్ అధినేత అయిన మైక్ లించ్ ను బ్రిటన్కు చెందిన బిల్గేట్గా పిలుస్తారు. ఇక ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో నలుగురు ఇంగ్లండ్ పౌరులు, ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. లించ్ భార్య ఏంజెలా బకేర్స్ తో పాటు మరో 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు.